
Benjamin Netanyahu: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా, పశ్చిమాసియాలో సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందంపై ఈ శుక్రవారం జెనీవాలో సంతకాలు జరగనున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకున్నంత మాత్రాన తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ను వినాశనం నుంచి తాము కాపాడుకున్నామని, అయితే తమ పోరాటం ఇంకా ముగియలేదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందాలతో సంబంధం లేకుండా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని హెచ్చరించారు.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకున్న సంబంధాల గురించి నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తనకు అత్యంత సన్నిహిత భాగస్వామి అయినప్పటికీ, కొన్ని విషయాల్లో తమ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అంగీకరించారు. అగ్రరాజ్యం తీసుకునే ప్రతి నిర్ణయంతో తాము ఏకీభవించాల్సిన అవసరం లేదని, ఇజ్రాయెల్ భద్రత విషయంలో తమదైన శైలిలో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అణిచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో తాము వెనకడుగు వేయమని వివరించారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం బహిర్గతమైన తర్వాత మాట్లాడిన ఆయన, ఇజ్రాయెల్-అమెరికా ఉమ్మడి సైనిక చర్యలు అణు వినాశన ముప్పును తాత్కాలికంగా అడ్డుకున్నాయే తప్ప, సవాళ్లు ఇంకా అలానే ఉన్నాయని గుర్తుచేశారు.
లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లాను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన బఫర్ జోన్ విషయంలోనూ నెతన్యాహు కఠినంగా వ్యవహరించారు. తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని, దాడులను తిప్పికొట్టే విషయంలో తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ధీమా వ్యక్తం చేశారు. హిజ్బుల్లా గతంలో ఉపయోగించిన కీలక ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుందని, ఏ ధర చెల్లించైనా ఆ రక్షణ కవచాలను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం తమ దేశానికి పెను ముప్పు అని భావిస్తున్న నెతన్యాహు, ఆ ప్రమాదాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాజకీయంగా ఏవైనా మార్పులు జరిగినా, ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన మాటల్లో స్పష్టమైంది.