రోజుకు వేల రూపాయల ఆదాయం, కొద్దిరోజుల్లో డబ్బు రెట్టింపు, టాస్క్ పూర్తి చేస్తే భారీ కమిషన్, ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫార్ములు, ఫేక్ వెబ్సైట్లను వాడి అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
అసలు సైబర్ మోసం ఎలా జరుగుతోంది?
సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా కానీ టెలిగ్రామ్ నుంచి కానీ బాధితులను సంప్రదించి ప్రత్యేక గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఆ గ్రూపుల్లో అంతర్జాతీయ కంపెనీలు, ప్రముఖ హోటళ్లు, రిసార్టులు లేదా పెద్ద బ్రాండ్ల ప్రతినిధులమని చెప్పుకుంటూ నమ్మకం కల్పిస్తారు.పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో మొదట చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టించి, కొంత లాభం వచ్చినట్లు ఆశ చూపించి, తర్వాత పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెడుతున్నారు.
ఈ మోసాల్లో భాగంగా ‘ప్రొడక్ట్ ప్రమోషన్’, ‘ఆన్లైన్ టాస్క్లు’, ‘ఆర్డర్ బుకింగ్’, ‘ట్రేడింగ్ కార్యకలాపాలు’ వంటి పనులు చేస్తే అధిక కమిషన్ లేదా లాభాలు వస్తాయని నమ్మిస్తారు.ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లో నమోదు చేయించి, మొదట చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టిస్తారు. మొదట కొన్ని వందలు లేదా వేల రూపాయలు చెల్లించి నిజంగా లాభాలు వస్తున్నాయనే నమ్మకం కల్పిస్తారు. ఆ తర్వాత మరింత అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు.
బాధితుడు పెట్టుబడులు పెంచిన కొద్దీ నకిలీ వెబ్సైట్లో భారీ లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. కానీ డబ్బు విత్డ్రా చేసుకునే సమయంలో కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొస్తారు.
ఖాతాలో లాభాలు కనిపిస్తాయి.. కానీ డబ్బులు రావు : నకిలీ ట్రేడింగ్ లేదా పార్ట్టైమ్ జాబ్ వెబ్సైట్లలో భారీ లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. అయితే డబ్బు విత్డ్రా చేసుకునే సమయంలో కొత్త కొత్త కారణాలు చెబుతారు.డబ్బు ఉపసంహరించుకోవాలంటే “అకౌంట్ వెరిఫికేషన్ ఫీజు”, “ట్యాక్స్ క్లియరెన్స్”, “సెక్యూరిటీ డిపాజిట్”, “వీఐపీ అప్గ్రేడ్”, “విత్డ్రా అన్లాక్ ఛార్జీలు” వంటి పేర్లతో మరిన్ని చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టిన బాధితులు తమ డబ్బు తిరిగి వస్తుందనే ఆశతో మళ్లీ మళ్లీ డబ్బులు చెల్లిస్తారు. అయినప్పటికీ డబ్బు విత్డ్రా చేయలేరు. చివరికి నేరగాళ్లు బాధితులను బ్లాక్ చేయడం లేదా మరిన్ని డబ్బులు అడగడం జరుగుతుంది.
సైబర్ మోసాలు జరగకుండా జాగ్రత్తలు ఇవే: టెలిగ్రామ్, సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అధిక లాభాల హామీలను నమ్మవద్దు. పెట్టుబడి పెట్టమని కానీ టాస్కులు పూర్తి చేయాలంటే ముందుగా డబ్బు చెల్లించమని చెప్పే ఉద్యోగ అవకాశాలను నమ్మొద్దు. తెలియని వ్యక్తులు పంపిన ట్రేడింగ్ వెబ్సైట్లు, యాప్లు లేదా లింకులపై నమోదు చేసుకోవద్దు. గ్రూపుల్లో కనిపించే లాభాల స్క్రీన్షాట్లు, ఫేక్ రివ్యూలను అసలు నమ్మవద్దు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాలకు దూరంగా ఉండండి. డబ్బు విత్డ్రా చేయడానికి అదనపు చెల్లింపులు కోరితే వెంటనే జాగ్రత్త పడండి. ఇప్పటికే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందనే ఆశతో మరిన్ని డబ్బులు చెల్లించవద్దు. 1930 – సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయండి లేదా National Cyber Crime Reporting Portal సైట్ నుంచి ఫిర్యాదు నమోదు చేయండి




