
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారి భార్య తనపై అత్యాచారం, బ్లాక్మెయిల్, బలవంతపు మతమార్పిడి జరిగినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు అతని సహచరుడు అమీన్ షేక్ను అరెస్టు చేశారు. మతమార్పిడి కార్యక్రమంలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మౌలానా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. 2025 ఫిబ్రవరి 8న ఒక హోటల్లో అయాజ్ మదారే బాధితురాలి పానీయంలో మత్తుమందు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి, వాటిని భర్తకు పంపిస్తానని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ బెదిరింపులతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, సుమారు రూ.4 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో వైరల్గా మారిన ఒక వీడియో కీలక ఆధారంగా మారింది. వీడియోలో బాధితురాలు ఏడుస్తూ తనను వదిలేయాలని వేడుకుంటుండగా, నిందితుడు మతపరమైన శ్లోకాలు పఠిస్తూ ఆమెపై ఊదుతున్నట్లు కనిపిస్తోంది. అనంతరం తనను బలవంతంగా మతం మార్చుకున్నట్లు ప్రకటించి, అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు తరచూ ఒక ద్రవాన్ని తాగమని బలవంతం చేసి, దానిని హిప్నాసిస్ లేదా క్షుద్రవిద్యగా పేర్కొంటూ తనపై లైంగిక దాడులకు పాల్పడేవాడని తెలిపింది. మే 31న ఆమెను కల్మేశ్వర్కు తీసుకెళ్లి, ఒక మౌలానా సమక్షంలో బలవంతంగా మతమార్పిడి చేయించి, ‘నికాహ్’(పెళ్లి) చేసుకున్నట్లు కూడా ఆరోపించింది.
ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, పదేపదే లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, దోపిడీ, బలవంతపు మతమార్పిడి, క్షుద్రశక్తుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి