
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం తాజాగా సుప్రీంకోర్టు దృష్టికి చేరడంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. విరాళాల వినియోగంపై పారదర్శక దర్యాప్తు జరపాలని కోరుతూ న్యాయవాది అనూప్ అవస్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం న్యాయస్థాన పర్యవేక్షణలో విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, కోర్టులో కేసులను మౌఖికంగా ప్రస్తావించకుండా లిఖితపూర్వకంగా వినతులు సమర్పించాలని సీజేఐ సూర్యకాంత్ న్యాయవాదులకు సూచించారు. సంబంధిత అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ వివాదంపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆలయంలోని విరాళాల పెట్టెల నిర్వహణకు సంబంధించిన ఆరోపణలపై ఈ బృందం సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ఈ SITలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్., ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో విరాళాల పెట్టెలకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఆరోపణలు, వదంతులను తీవ్రంగా పరిగణించి నిష్పక్షపాత విచారణ జరపాలని ట్రస్ట్ ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, ఈ వివాదంపై రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రామ మందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. శ్రీరామునికి అంకితమైన పవిత్ర కార్యానికి ప్రజలు ఇచ్చిన విరాళాల విషయంలో ఎలాంటి అనుమానాలున్నా వాటిని అత్యంత తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. అయితే, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, రామ మందిరం ప్రతిష్ఠను దెబ్బతీసేలా అఖిలేష్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తన బాధ్యత నిర్మాణ పనుల పర్యవేక్షణకే పరిమితమని, విరాళాల నిర్వహణ లేదా ఆర్థిక వ్యవహారాలపై వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. కాగా, సుప్రీంకోర్టు స్పందన, SIT దర్యాప్తు నివేదికల తర్వాత ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..