Reading Time: 2 minutes
Sanchita Ugale Death Controversy Friend Alleges Harassment By Co Star

మరాఠీ నటి సంచితా ఉగలే (22) అకాల మరణం టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులో మృతి చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే సంచితా ఉగలే మరణంపై తాజాగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. సహనటుడు వేధింపులు కారణంగానే సంచిత చనిపోయిందని స్నేహితురాలు ఆరోపించింది. ప్రస్తుతం ఈ వార్తలు సంచలనంగా మారాయి.

1

కుంకుమ్ భాగ్య సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్న సంచితా ఉగలే జూన్ 14న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. నివేదిక రాగానే మరణానికి గల కారణాలను తేల్చనున్నారు. అయితే సంచిత మరణంపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. ఉన్నత స్థాయి విచారణతో పాటు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న మరణాలు, మానసిక ఆరోగ్య సంక్షోభాల విస్తృత ధోరణిని పారదర్శకంగా పరిశీలించాలని కోరింది.

ఇక సంచిత స్నేహితురాలు, నటి ఇంద్రక్షి కంజిలాల్ కీలక ఆరోపణలు చేశారు. ‘సాజన్ ఘర్’ సీరియల్‌లోని సహనటుడు ఉజ్జ్వల్ శర్మ నుంచి సంచితా ఉగలే మానసిక వేధింపులు ఎదుర్కొందని ఆరోపించారు. ‘సాజన్ ఘర్’ సీరియల్ సమయంలో సంచిత చాలా ఇబ్బందులు పడ్డాదని గుర్తుచేశారు. ‘‘ఉజ్జ్వల్ శర్మ సంచిత దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని.. ఆ తర్వాత ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు.. అతను ఆమెపై విరుచుకుపడి.. అవమానించడమే కాకుండా.. కొడతానని కూడా బెదిరించాడు. వారి చాట్‌లలో అతను అనుచితమైన భాష వాడి.. ఆమెను అవమానించిన స్క్రీన్‌షాట్‌లు నా దగ్గర ఉన్నాయి..’’ అని ఇంద్రక్షి కంజిలాల్ పేర్కొన్నారు.

సంచిత తాను ఎదుర్కొంటున్న విషయాల గురించి ఫిర్యాదులు చేసిందని ఆరోపించారు. ‘‘సంచిత తాను ఎదుర్కొంటున్న వేధింపులు, ఇతర విషయాల గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే చివరికి ఏమీ మారదని ఆమె గ్రహించింది. అందుకే ఆమె షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది.’’ అని ఇంద్రాక్ష అన్నారు.

ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సంచిత మరణానికి కచ్చితమైన కారణాలను పోలీసులు వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తు్న్నారు. అలాగే ఆమె ఫోన్‌ను.. సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.