Reading Time: 2 minutes
Jr NTR: నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన సినిమా.. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు, తన ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు తారక్. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇంతకీ తారక్ కు అంత బాగా నచ్చిన సినిమా ఏదనుకుంటున్నారా? టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టుకుని తెరకెక్కించిన సినిమా సింగ్ గీతం. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, కమల్ హాసన్ తదితర సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఎన్టీఆర్ కూడా సింగ్ గీతం సినిమా చూసి తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసుకున్నారు.

‘నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్‌ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి’ అంటూ రాసుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి