
Peddi : ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్లో మున్నా భయ్యాగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటుడు దివ్యేందు శర్మ. ఇప్పుడు తను టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ‘మీర్జాపూర్’ తో హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు దివ్యేందు. ఈ నటుడు తెలుగు తెరపై అడుగుపెడుతున్నాడనే వార్త వచ్చినప్పుడే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రంలో అతను కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి మాత్రం ఊహించిన దానికి భిన్నంగా కనిపిస్తోంది.
‘పెద్ది’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇందులో నటిస్తున్న ప్రతి పాత్రపై ప్రత్యేక దృష్టి పడింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో దివ్యేందు భాగమవ్వడం వల్ల ఉత్తరాది ప్రేక్షకుల దృష్టి కూడా సినిమాపై పడింది. ‘మీర్జాపూర్’ లో అతను చూపించిన నటన, స్క్రీన్ ప్రెజెన్స్, విలక్షణమైన డైలాగ్ డెలివరీ కారణంగా తెలుగు ప్రేక్షకులు కూడా అతని పాత్రపై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్లో అతనికి మంచి ఆరంభం దక్కుతుందని చాలామంది భావించారు.
అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తే దివ్యేందు పాత్రకు ఆశించినంత ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతని నటనపై ఎలాంటి విమర్శలు లేకపోయినా, పాత్ర పరిధి పరిమితంగా ఉండటం వల్ల ప్రేక్షకులపై గట్టి ముద్ర వేయలేకపోయింది. ఒక నటుడి ప్రతిభను పూర్తిగా వెలికితీయాలంటే కథలో అతనికి సరిపడే స్పేస్ ఉండాలి. కానీ ‘పెద్ది’ విషయంలో అది కొంత వరకు మిస్ అయినట్లు కనిపిస్తోంది. అయినా దివ్యేందు సనీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదు. సినిమా విడుదల తర్వాత హైదరాబాద్లోని పలు థియేటర్లను సందర్శించిన ఆయన, ప్రేక్షకుల స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన తదుపరి తెలుగు ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో దివ్యేందు కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాల్లో పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండే విషయం తెలిసిందే. అలాంటి దర్శకుడి చేతుల్లో దివ్యేందుకు మరింత బలమైన పాత్ర దొరికితే, తెలుగు ప్రేక్షకులు అతనిని కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. ‘పెద్ది’ దివ్యేందుకు భారీ బ్రేక్ ఇవ్వకపోయినా, తెలుగు పరిశ్రమ అతనికి మంచి ప్రారంభమే ఇచ్చింది. అయితే ‘ఆదర్శ కుటుంబం’తో మున్నా భయ్యా ఈసారి నిజంగా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తాడా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.