Reading Time: 2 minutes
Harmanpreet Kaur On Richa Ghosh Id Send Her To Bat On The First Ball India Vs Pakistan Wt20 Wc 2026

Harmanpreet Kaur Reaction on India Win against Pakistan: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయంతో తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల భారీ తేడాతో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేశారు. భారత అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

భారత అభిమానులకు ధన్యవాదాలు:

మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘ముందుగా భారత అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ మాకు అండగా ఉంటున్నారు. మీ మద్దతు మా జట్టుకు ఎంతో విలువైనది. అందుకే ఈ విజయాన్ని మీకు అంకితం చేస్తున్నా. జట్టుకు అవసరమైన సమయంలో సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. జట్టుకు అవసరమైన ప్రతిసారీ స్మృతి మంధాన, దీప్తి శర్మలు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారు. ఈరోజు ఇద్దరు అద్భుతంగా ఆడారు. వారి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.

మొదటి బంతికే బ్యాటింగ్‌కు పంపిస్తా:

‘ఎడ్జ్‌బాస్టన్ పిచ్ బాగానే ఉంది. కానీ మొదట్లో మేమే మాపై ఒత్తిడి పెంచుకున్నాం. తర్వాత నేను, స్మృతి కలిసి ఇన్నింగ్స్‌ను నియంత్రించే ప్రయత్నం చేశాం. మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలిగాం’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌పై హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘నా చేతిలో ఉండే విషయమైతే.. రిచాను మొదటి బంతికే బ్యాటింగ్‌కు పంపిస్తాను. కానీ జట్టులో ఆమెకు ఒక ప్రత్యేక పాత్ర ఉంది. ఆ బాధ్యతను రిచా అద్భుతంగా నిర్వర్తిస్తోంది. ఈరోజు ఆమె ఆడిన ఇనింగ్స్ అద్భుతం. ఆ ఇన్నింగ్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని హర్మన్‌ప్రీత్ నవ్వుతూ చెప్పింది.

నెట్ రన్‌రేట్ కూడా కీలకం:

మ్యాచ్ ఆరంభంలో ఫీల్డింగ్‌లో కొన్ని చిన్న తప్పిదాలు జరిగినప్పటికీ.. తర్వాత జట్టు అద్భుతంగా పుంజుకుందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ‘క్రికెట్‌లో క్యాచ్‌లు కీలకం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే మ్యాచ్ గెలవడం సులభమవుతుంది. మేము ప్రతి బంతికి పూర్తి నిబద్ధతతో ఆడాలని అనుకున్నాం. ఫీల్డింగ్‌లో జట్టు చూపిన డెడికేషన్ బాగుంది. టోర్నీలో ప్రతి లీగ్ మ్యాచ్ ఎంతో ముఖ్యం. భారీ విజయాలు నెట్ రన్‌రేట్ పరంగా కూడా కీలకం అవుతాయి. టోర్నీ చివరి దశలో నెట్ రన్‌రేట్ ఉపయోగపడుతుంది’ అని చెప్పింది.

ఎలాంటి సమస్య లేదు:

మ్యాచ్ ముగిసే సమయానికి హర్మన్‌ప్రీత్ కొంత ఇబ్బందిగా నడుస్తూ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన గాయం గురించి స్పందిస్తూ.. ‘నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు’ అని స్పష్టం చేసింది. స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9×4, 2×6), రిచా ఘోష్‌ (34; 17 బంతుల్లో 5×4, 1×6), దీప్తి శర్మ (5/10) మెరవడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. హర్మన్‌ప్రీత్‌ 35 బంతుల్లో 36 రన్స్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమిష్టి ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టోర్నీలో బలమైన సందేశాన్ని పంపించింది.