
Elon Musk: ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ గా రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (IPO) కి వచ్చిన తరుణంలో మస్క్ సంపద ఊహించని స్థాయికి చేరింది. అయితే ఒక్కటంటే ఒక్క ట్రేడింగ్ రోజులోనే మస్క్ నికర విలువ ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.7 లక్షల కోట్లు) పెరిగింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే 14.71 శాతం ఎక్కువ.
ఎలాన్ మస్క్ ఈ ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటడానికి జూన్ 12న జరిగిన స్పేస్ఎక్స్ ఐపీఓ (IPO) వేదికైంది. రాకెట్లు, శాటిలైట్లు, ఏఐ (AI) సాంకేతికతలో దూసుకుపోతున్న స్పేస్ఎక్స్ కంపెనీ.. తన పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లను మార్కెట్ నుంచి సమీకరించింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మస్క్ ఆస్తి 780 బిలియన్ డాలర్లు. అప్పట్లోనే ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ధనవంతుడి ఆస్తి (300 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ మూడు రెట్లతో ముందున్నారు. శుక్రవారం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం స్పేస్ఎక్స్లోనే మస్క్ వాటా విలువ 866 బిలియన్ డాలర్లకు చేరింది. దీనికి టెస్లా, ఇతర ఆస్తులు తోడవడంతో ఆయన మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లను దాటి, ప్రస్తుతం 1.3 ట్రిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకే రోజులో ఇంతటి భారీ సంపదను ఆర్జించకపోవడంతో, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఎలాన్ మస్క్ పేరే మారుమోగిపోతోంది.
ఇదే సమయంలో ఆదివారం ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న తన ‘స్పేస్ఎక్స్’ సంస్థ రాబోయే 2030 నాటికి ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించబోతోందని ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో వారాంతంలో వాల్ స్ట్రీట్ (Wall Street) స్టాక్ మార్కెట్ విశ్లేషకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ టార్గెట్ ఎంత భారీదో అర్థం కావాలంటే కంపెనీ ప్రస్తుత ఆదాయాన్ని చూడాల్సిందే. 2025 ఆర్థిక సంవత్సరంలో స్పేస్ఎక్స్ మొత్తం ఆదాయం కేవలం 18.7 బిలియన్ డాలర్లు మాత్రమే. పైగా ఈ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లాభాలను (Profits) కూడా నివేదించలేదు. ఇటువంటి తరుణంలో మస్క్ ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ టార్గెట్ను ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మస్క్ ప్రకటనతో మార్కెట్లో జోష్ కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు, పోర్ట్ఫోలియో మేనేజర్లు హెచ్చరిస్తున్నారు.