
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో చుక్కల దుప్పిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని నీటి కుంటలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిగా పిలుచుకునే పొడదుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో దుప్పి కుంట ఒడ్డునే చనిపోయింది. నీటిని తాగేందుకు వచ్చిన క్రమంలోనే జింకపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకని పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించారు. నల్లమల్ల అటవీ ప్రాంతం అతి సమీపంలో ఉండడం వల్లే దాహం తీర్చుకునేందుకు చుక్కల దుప్పి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు…
పెద్దచెరువు పంచాయతీ పరిధిలోని చెరువులో నీరు తాగేందుకు వచ్చి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డ దుప్పిని అటవీశాఖ ధికారులు పరిశీలించారు. సబ్ డీఎఫ్వో బాలరాజు, డీఆర్వో వంశీ కృష్ణకుమారి, బీటు అధికారి కె. లక్ష్మానాయక్ దుప్పి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం దుప్పికి దహనసంస్కారాలు నిర్వహించారు.