Reading Time: < 1 minute
Rice Washing: అన్నం వండే ముందు బియ్యాన్ని కడగాలా? వద్దా..?.. కొత్త స్టడీలో తేలిందేంటి?

బియ్యాన్ని వండటానికి ముందు కడగడం అనేది మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న అలవాటు. సాధారణంగా బియ్యంపై ఉండే ధూళి, రసాయనాలు లేదా మైక్రోప్లాస్టిక్‌లను తొలగించడానికి మనం బియ్యాన్ని కడుగుతాము. బియ్యం కడిగినప్పుడు వచ్చే తెల్లటి లేదా పాల రంగు నీరు అందులోని స్టార్చ్ వల్ల వస్తుంది. అయితే, ఇలా కడగడం వల్ల కేవలం మురికి మాత్రమే కాదు, బియ్యంలో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా కొట్టుకుపోతాయని తాజాగా వెలువడిన కొన్ని అధ్యనాలు చెబుతున్నాయి.

పోషకాలు తగ్గే అవకాశం ఉందా?

లైవ్ సైన్స్ కథనం ప్రకారం, బియ్యాన్ని ఎక్కువగా కడగడం వల్ల వాటిలో ఉండే నీటిలో కరిగే గుణం ఉన్న ఐరన్ , జింక్, రాగి, వెనాడియం వంటి ముఖ్యమైన సహజ పోషకాలు తగ్గిపోతాయని తేలింది. అయితే, ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం రోజువారీ తీసుకునే మొత్తం పోషకాలలో బియ్యం ద్వారా లభించే వాటా కొంతే కాబట్టి, దీన్ని కడగడం వల్ల పోషకాహార లోపం వచ్చేంత పెద్ద నష్టమేమీ జరగదని తెలుస్తోంది.

గతంలో అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, బియ్యాన్ని పండించేటప్పుడు, పాలిష్ చేసేటప్పుడు వాటిపై చేరే తవుడు, ధూళిని తొలగించడానికి కడగడం అవసరమే. కానీ, 3 నుండి 5 సార్లు ఎక్కువగా కడగడం వల్ల బియ్యం పైపొరల్లో ఉండే దాదాపు 60 నుండి 80 శాతం ఫ్యాట్స్, పోషకాలు నీటిలో కలిసి పోతాయి. ఆ నీటికి మనం పారబోయడం ద్వారా ఈ పోషకాలను మనం కోల్పోతామని చెబుతున్నాయి. కాబట్టి బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడితే సరిపోతుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఎలాంటి బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు?

ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో లభించే ప్యాక్ చేసిన బియ్యాన్ని వినియోగదారులకు అందించే ముందే అత్యాధునిక మిషన్లు, బ్లోయర్ల ద్వారా క్లీన్ చేసి, ఆరబెడతారు. దీనివల్ల నిల్వ ఉంచినప్పుడు వాటిలో ఎలాంటి పురుగులు, బ్యాక్టీరియా చేరవు. ఇలాంటి బియ్యాన్ని అసలు కడగాల్సిన అవసరం లేదు. ఒక వేల మీరు మిళ్లు నుంచి నేరుగా బియ్యాన్ని తెచ్చుకుంటే లేదా రేషన్ షాప్‌ నుంచి తెచ్చకున్న బియ్యాన్ని మాత్రం ఒకటి లేదా రెండు సార్లు కడిగితే సరిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.