Reading Time: < 1 minute
India Bangladesh Row This Is Not Sheikh Hasina Government Says Pm Adviser

India-Bangladesh: పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ ఉర్ రెహ్మన్ సలహాదరులు జాహెద్ ఉర్ రెహమాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతకు కారణమైంది. ఇటీవల, భారత్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కోసం వచ్చిన జాహెద్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 2.5 గంటల పాటు నిలిపేశారు. భారత బ్లాక్‌లిస్టులో ఇతడి పేరు ఉంది. దీంతో అధికారులు విచారణ చేశారు. అయితే, దౌత్య కార్యక్రమంలో కోసం వచ్చిన జాహెద్ తన దౌత్య పాస్‌పోర్టు ఉపయోగించకుండా, సాధారణ పాస్‌పోర్టు ఉపయోగించారు. కావాలనే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఢిల్లీ ఘటన తర్వాత అతను కొలంబో మీదుగా ఢాకాకు వెంటనే వెళ్లిపోయాడు.

ఈ సంఘటనపై జాహెద్ ఉర్ రెహ్మాన్ భారత్‌ను హెచ్చరించే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదనే సందేశాన్ని దేశం లోపల, బయట పంపాల్సిన అవసరం ఉందని భావించా’’ అని అన్నాడు. భారత అధికారులు తనను వేధించినట్లు బంగ్లాదేశ్ మీడియాతో చెప్పాడు. తన నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య శత్రుత్వం, ప్రతికూల పరిస్థితిని కోరుకోవడం లేదని చెబుతూనే భారత్‌పై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు.

జాహెద్ తరుచుగా భారత్‌ను విమర్శిస్తాడు. ఒకానొక సమయంలో భారత్‌ను ‘‘మూర్ఖపు పొరుగుదేశం’’ అని విమర్శించాడు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ఘటనపై మాట్లాడుతూ.. తాను అక్కడికి బంగ్లా ప్రతినిధిగా వెళ్లానని, తనకు జరిగిన అవమానానికి నిరసన తెలిపినట్లు చెప్పాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదని, ప్రజల ఆమోదం పొందిన ప్రభుత్వం అని, ఈ సందేశాన్ని పంపాలనే భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.