Reading Time: < 1 minute
Andhra Pradesh Launches Stop Diarrhoea Campaign Free Ors And Zinc For 3 75 Million Children

Stop Diarrhoea Campaign: రాష్ట్రంలో డయేరియా నివారణకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘స్టాప్ డయేరియా’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమై జులై 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదేళ్లలోపు చిన్నారులను డయేరియా బారిన పడకుండా కాపాడడం, వ్యాధిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 37.53 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా రెండు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని చిన్నారుల ఇళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వెళ్లి ఈ మందులను అందజేయనున్నారు.

అలాగే డయేరియా లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను ఉచితంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం 95,37,141 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 5,25,53,908 జింక్ మాత్రలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. డయేరియా భారతదేశంలో అధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో ఐదో స్థానంలో ఉందని అధికారులు గుర్తు చేశారు. ముఖ్యంగా చిన్నారుల్లో డయేరియా వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

అయితే డయేరియా నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (NFHS-6) గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా కేసుల శాతం గతంలో 7.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 4.8 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. జులై 31 వరకు నిర్వహించే ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, సురక్షిత తాగునీటి వినియోగం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.