Reading Time: < 1 minute
Delhi Techie Radha Gayatri Found Dead During Honeymoon Trip In Mussoorie

Honeymoon Mystery: యువజంట హనీమూన్ మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఉన్న ఒక హోమ్ స్టేలో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మరణించిన మహిళను పి. రాధా గాయత్రిగా గుర్తించారు. ఈమె గురుగ్రామ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలోని కిద్వాయా నగర్ ఈస్ట్‌లో నివసిస్తోంది. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి కలిసి హనీమూన్ వెళ్లింది. భర్త పూణేలోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.

జూన్ 14 రాత్రి వేళ ఇద్దరు టిప్రిధార్‌లో ఉన్న కియానా హోమ్ స్టేకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు కూడా తెల్లవారుజామున 3.30 గంటల వరకు మద్యం సేవించి, నిద్రపోయినట్లు వెల్లడించాడు. ఉదయం నిద్ర లేచినప్పుడు, తన భార్య నగ్నంగా, స్పృహ లేకుండా నేలపై మూత్రంలో పడి ఉందని చెప్పాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పారు. ఘటన గురించి తెలిసిన పోలీసులు, మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అంబులెన్స్ లోని సిబ్బంది ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. బెడ్ షీట్‌పై రక్తం మరకలు, గదిలో రెండు మద్యం బాటిళ్లు, ఆహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతురాలు గాయత్రికి, శ్రీచరణ్‌లకు 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరిది విశాఖపట్నం. ప్రస్తుతం పోస్టుమార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. వైద్యుల బృందం పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను కెమెరాలో రికార్డ్ చేయాలని పోలీసులు కోరారుు. పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.