Reading Time: < 1 minute
Neet 2026 Apsrtc Offers Free Bus Travel For Students Special Services On June 21

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2026 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది. జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా.. ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపిస్తే చాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా అవసరమైన ప్రాంతాల్లో అదనపు ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాస్తుంటారు. ఈ నేపథ్యంలో పరీక్ష రోజు రవాణా సమస్యలు ఎదురుకాకుండా.. విద్యార్థులకు పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ కలిసి ఈ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాయి. పరీక్ష రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను వెంట తీసుకెళ్లి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. నీట్ రీటెస్ట్ జూన్ 21న నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. రీ ఎగ్జామ్‌ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌ను బ్లాక్ చేసింది. నీట్ రీటెస్ట్ జూన్ 21 కాగా.. జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఎన్టీఏ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ తాత్కాలిక ఆంక్షలు విధించింది.