
ప్రపంచ దేశాలు ఆయిల్, గ్యాస్ సంక్షోభంలో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో.. ఇరాన్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 15 నౌకలు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, సీజ్ఫైర్ ఒప్పందంలో భాగంగా ట్రాఫిక్ లిమిట్ పెట్టింది ఇరాన్. జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో.. ఈ పరిమితి విధించడం ఆందోళన కలిగించే అంశం.
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి, ఎదురు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాతో రెండు వారాల సీజ్ఫైర్ (యుద్ధవిరామం) ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఇరాన్ జలసంధి ట్రాఫిక్ను పరిమితం చేయడం గమనార్హం. రష్యా వార్తా సంస్థ TASS ప్రకారం, ఇరాన్ ఉన్నత వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం… సీజ్ఫైర్ ఒప్పందం కింద రోజుకు 15 నౌకలకు మించి హార్ముజ్ జలసంధి గుండా వెళ్లనివ్వబోమని ప్రకటించారు.
సాధారణ రోజుల్లో సుమారు 140 నౌకలు వెళ్తుండగా, ఇప్పుడు రోజుకు 10 శాతం కంటే తక్కువ ట్రాఫిక్ మాత్రమే ఉంది. కొన్ని రోజుల్లో 7 నుంచి 15 నౌకలు మాత్రమే హర్మూజ్ గుండా వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని సముద్రపు చమురు సరఫరాలో నాలుగో వంతు ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమవుతోంది.
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకలు తమ భూభాగం దగ్గరగా, లారక్ ద్వీపం సమీపంలో ప్రయాణించాలని ఆదేశించింది. ఇజ్రాయెల్ లెబనాన్పై మళ్లీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజ్ఫైర్ ఒప్పందం ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. షిప్పింగ్ కంపెనీలు, భీమా సంస్థలు ఇంకా భద్రతపై ఆందోళనతోనే ఉన్నాయి.