ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే కేవలం వయసు పైబడిన వారికే వస్తుందని అనుకునేవాళ్ళం. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దేశంలో 30 ఏళ్లు కూడా నిండని యువతలో డయాబెటిస్ లక్షణాలు భారీగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ నివేదిక విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. యువత ఎందుకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు? దీని నుండి బయటపడటం ఎలా? అనే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్: ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ నివేదిక ప్రకారం, భారత్లో 30 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ‘ప్రీ-డయాబెటిక్’ దశలో ఉన్నారు. అంటే, వీరికి ఇప్పుడే షుగర్ వ్యాధి రాకపోయినా, రావడానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. అలాగే సగం కంటే ఎక్కువ మంది యువత అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం.
చిన్న వయసులోనే గుర్తిస్తే మేలు: డయాబెటిస్ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. 30 ఏళ్ల లోపు ఈ సమస్యను గుర్తిస్తే, జీవనశైలి మార్చుకోవడం ద్వారా 28 శాతం మంది మళ్ళీ సాధారణ స్థితికి (Normal) వచ్చే అవకాశం ఉంటుంది. అదే 50 ఏళ్లు దాటాక ఈ వ్యాధిని గుర్తిస్తే, మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ కేవలం 7 శాతం మాత్రమే ఉంటుంది. ఇక అందుకే ఆలస్యం చేయకుండా ముందే మేల్కొనడం చాలా ముఖ్యం.

ఎందుకీ మార్పు?: సరైన శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అతిగా తినడం, విపరీతమైన పని ఒత్తిడి వల్ల యువతలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు దీనికి తోడు నిద్రలేమి సమస్య కూడా తోడవ్వడంతో చిన్న వయసులోనే షుగర్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
చెకప్ ఒక్కటే మార్గం: చాలామందికి తమకు షుగర్ ఉందని కూడా తెలియదు. ఏదైనా ఇతర సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది బయటపడుతోంది. అందుకే డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే.. కనీసం ఏడాదికి ఒకసారి పూర్తి స్థాయి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా రక్త పరీక్షల ద్వారా షుగర్ లెవల్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
ఆహారం మరియు వ్యాయామం: మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. రోజూ కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ అనే మహమ్మారిని దూరం పెట్టవచ్చు.
వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ అందరినీ చుట్టుముడుతోంది. ముఖ్యంగా మన దేశ యువత ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించకూడదు.
గమనిక: పైన అందించిన సమాచారం నివేదికల ఆధారంగా అంచనా వేయబడింది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోగలరు.
The post యంగ్ ఏజ్లోనే డయాబెటిస్.. ఆందోళన కలిగిస్తున్న ట్రెండ్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.