Reading Time: < 1 minute
Telangana: ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికెళ్లిన 18 మంది చిన్నారులు..  కాసేపటికే ఇది పరిస్థితి!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని 18 మంది చిన్నారులు అస్వస్థతకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న పానీపూరి బండివద్ద మంగళవారం సాయంత్రం కొందరు చిన్నారు పానీపూరి తిన్నారు. ఇది తిన్న కాసేపటికే కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. మరి కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అస్వస్థతకు గురైన చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో కేసీఆర్ నగర్ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. పానీపూరి తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే దానిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులందరికీ ఒకే తరహా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చిన్నారుల అనారోగ్యానికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశముంది.

చిన్నారులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దృశ్యాలు ఇదిగో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.