Reading Time: 2 minutes
Rcb Sale 16706 Crore Vijay Mallya Reaction Ipl Franchise

Vijay Mallya: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) చేతులు మారిన విషయం తెలిసిందే. లీగ్‌ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ (యుఎస్‌ఎల్‌) సంస్థ.. ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ఇండియా, బోల్ట్‌ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్‌ సంస్థలు కలిసి ఈ ఫ్రాంఛైజీని చేజిక్కించుకున్నాయి. ఆర్సీబీ పురుషులతో పాటు మహిళల జట్టును కూడా కలిపే ఈ నాలుగు సంస్థల కన్సార్షియం సొంతం చేసుకుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా, ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో జరిగిన అమ్మకంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆర్‌సీబీ కొత్త యజమానులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. వారికి అంతా మంచే జరగాలని కోరుకున్నారు.

READ MORE: Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

ఆర్సీబీ (RCB) కొత్త యజమానులకు నా హృదయపూర్వక అభినందనలు. ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆర్సీబీ ఫ్రాంచైజీతో మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2008లో నేను ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు, చాలా మంది నన్ను చూసి నవ్వారు. అదొక పనికిరాని పెట్టుబడి అని విమర్శించారు. కానీ, ఆ నిర్ణయం వెనుక నా అసలు లక్ష్యం ‘రాయల్ ఛాలెంజ్’ బ్రాండ్‌ను నిర్మించడం. అందుకే దీనికి RCB అని పేరు పెట్టాను. నాడు నేను పెట్టిన రూ.450 కోట్ల పెట్టుబడి నేడు రూ.16,500 కోట్లకు పెరగడం చూడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. అప్పట్లో యువకుడైన విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం నా మధుర జ్ఞాపకాలలో ఒకటి. నేడు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు. ఆర్సీబీని ఆదరిస్తున్న అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ‘బెంగళూరు సింహం’ అయిన ఆర్సీబీకి మీ మద్దతు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం” అని విజయ్ మాల్యా ట్వీట్‌లో పేర్కొన్నారు.