Reading Time: < 1 minute
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. చంద్రగ్రహణం సందర్బంగా మంగళవారం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ముఖ ద్వారాలు బంద్ చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. అనంతరం శుద్ది, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఆలయం మూసివేస్తుండటంతో కొండపై అన్నప్రసాద కేంద్రాలన్నీ బంద్ కానున్నాయి. దీంతో అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ తెలిపింది. కానీ భక్తుల కోసం పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

6 గంటల ముందుగానే బంద్

చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుండగా.. గ్రహణ సమయానికి 6 గంటల ముందే తిరుమల ఆలయాన్ని మూసివేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇక తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేశారు. రేపటి నుంచి 4వ తేదీ దర్శనానికి సంబంధించి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక తిరుపతి, పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆలయాన్నీ బంద్ కానున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీగోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి, శ్రీకోదండరామస్వామి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ వేదనారాయణస్వామి, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, శ్రీ కరివరదరాజస్వామి ఆలయాలను కూడా గ్రహణం కారణంగా మూసివేయనున్నారు. తిరుపతిలో నేడు ఆర్జిత సేవలను నిలిపివేయనుండగా.. నేటి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీరించమని టీటీడీ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు బంద్

ఇక చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు అన్నీ బంద్ కానున్నాయి. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాన్నీ క్లోజ్ చేయనున్నారు. గ్రహణం అనంతరం శుద్ది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా సోమవారం తిరుమల శ్రీవారిని 75,174 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు రాగా.. శ్రీవారికి 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.