
సిపిఐ దిగ్గజం, స్వాతంత్య్రసమర యోధుడు శతాధిక వృద్ధుడు (101 ఏళ్లు) ఆర్. నల్లకన్ను బుధవారం వయోవృద్ధాప్య రుగ్మతలతో ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులు అర్పిస్తూ ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ గౌరవ మర్యాదలతో జరుగుతాయని ప్రకటించారు. రాజకీయ వర్గాల నుంచి సంతాపాలు అశేషంగా వెలువడ్డాయి. ఇంటెన్సివ్ కేర్లో ఆయన చికిత్స పొందుతున్నప్పటికీ, ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు కన్నుమూశారని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రకటించింది. అస్వస్థతతో ఆయన ఫిబ్రవరి 1న ఆస్పత్రిలో చేరారు.
24 రోజుల పాటు వైద్యబృందం ఆయనకు సేవలందించింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన నల్లకన్ను దేనికీ రాజీపడని యోధుడని,కమ్యూనిస్టు, ద్రవిడ సిద్ధాంతాలు రెండూ సామాజిక మార్పునకు డబుల్ బ్యారెల్ గన్లా పనిచేయాలనే విశ్వాసంతో ఉండేవారని ముఖ్యమంత్రి స్టాలిన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. విశిష్ట తమిళ నాయకుని (థగైసల్ థమిజార్) అవార్డు ద్రవిడ ఆదర్శ ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రదానం చేయడం తన అదృష్టంగా స్టాలిన్ అభివర్ణించారు. మాజీ సిఎం ఎం.కరుణానిధి అంబేద్కర్ అవార్డును గతంలో నల్లకన్నుకు బహూకరించారు.