ఢిల్లీ గర్వకారణం… అక్షరధామ్ ఆలయం అద్భుత విశేషాలు!
భారతదేశ రాజధాని ఢిల్లీ నగర నడిబొడ్డున, యమునా నది తీరాన వెలిసిన అద్భుత కట్టడం ‘అక్షరధామ్ ఆలయం’ ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మరియు అద్భుత శిల్పకళకు నిలువెత్తు ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ మహా ఆలయ నిర్మాణ విశేషాలు దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర మరియు సరికొత్త ఆకర్షణల గురించిన పూర్తి సమాచారం మీకోసం..
ఐదేళ్ల నిరంతర శ్రమతో సాకారం: సరిగ్గా పాతికేళ్ల క్రితం, 2001 జూలై 2న ఈ ఆలయ సముదాయ పీఠ నిర్మాణానికి తొలి శిల్పాన్ని ప్రతిష్ఠించారు. ఇక అక్కడ నుంచి రాత్రింబవళ్లు వేలాది మంది కళాకారులు శ్రమించి కేవలం నాలుగేళ్లలోనే ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు. 2005లో భక్తుల కోసం తలుపులు తెరిచిన ఈ ఆలయం, నేడు దేశంలోనే అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలిచింది.
గులాబీ రాయి.. తెల్ల పాలరాయి వైభవం: ఈ అద్భుత ఆలయ సముదాయాన్ని 19వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువు ‘భగవాన్ స్వామినారాయణ్’ జ్ఞాపకార్థం నిర్మించారు. ఇక గులాబీ రంగు ఇసుకరాయి, తెల్లని పాలరాయి కలయికతో దీనిని అద్భుతంగా చెక్కారు. ఇక ఆలయ ప్రాంగణంలో దాదాపు 20 వేలకు పైగా దేవతా మూర్తుల శిల్పాలు మనకు దర్శనమిస్తాయి.

ఆకాశాన్ని తాకే 108 అడుగుల విగ్రహం: ఇటీవల ఈ ఆలయ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. భగవాన్ స్వామినారాయణ్ బాలసన్యాసి రూపమైన ‘నీలకంఠ వర్ణి’ పేరిట 108 అడుగుల భారీ కంచు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక ఒక చేతిలో జపమాల పట్టుకుని భక్తితో చేతులు పైకెత్తిన ఈ విగ్రహం వెనుక నుంచి చూస్తే అక్షరధామ్ ఆలయం కనిపించే దృశ్యం కనువిందు చేస్తుంది.
ఢిల్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం: ఢిల్లీలో వారణాసి, భువనేశ్వర్ లాంటి ప్రాచీన హిందూ దేవాలయాలు చాలా తక్కువ. 1206 నుండి 1857 వరకు సాగిన సుల్తానులు మొఘలుల సుదీర్ఘ పాలన వల్ల ఇక్కడ కోటలు, మసీదులు ఎక్కువగా వెలిశాయి. ఇక ఆ లోటును భర్తీ చేస్తూ ఆధునిక కాలంలో నిర్మించిన అక్షరధామ్, ఢిల్లీ వాస్తు వైభవానికి కొత్త గుర్తింపు తెచ్చింది.
ఇక అక్షరధామ్ ఆలయం ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన ఒక అద్భుత కళాఖండం. ఇక్కడి ప్రశాంతత, శిల్పకళా నైపుణ్యం మనసుకి ఎంతో హాయినిస్తాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని అస్సలు మిస్ అవ్వకండి.
The post ఢిల్లీ గర్వకారణం… అక్షరధామ్ ఆలయం అద్భుత విశేషాలు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.