NEET re-exam 2026 అభ్యర్ధులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు

హైదరాబాద్, జులై 6: ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్ ఫీజు రిఫండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు బ్యాంక్ వివరాల అప్డేట్కు అవకాశం ఇచ్చినప్పటికీ విద్యార్ధులు సుముఖత చూపడం లేదు. నీట్ యూజీ 2026 అభ్యర్థుల ఫీజు రీఫండ్ ప్రక్రియను ఎన్టీఏ ఇప్పటికే ప్రారంభించింది. అయితే, ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక పోర్టల్లో అప్డేట్ చేసుకున్నారు. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, అర్హులైన చాలా మంది అభ్యర్థులు తమ రీఫండ్ను కోల్పోయే అవకాశం ఉందని ఎన్టీయే హెచ్చరించింది.
ఈ క్రమంలో బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయడానికి మరోరోజు గడువు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. జులై 7, 2026 రాత్రి 11:50 గంటలలోపు బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇకపై గడువు పొడిగించే ఆలోచన లేనందని, అభ్యర్థులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.
నీట్ యూజీ రీ-టెస్ట్ 2026 ఫలితాలు ఎప్పుడంటే?
పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 21న 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు తిరిగి నీట్ రీఎగ్జాంను జూన్ 21న నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు జులై 20వ తేదీలోపు విడుదలయ్యే అవకాశం ఉందని ఎన్టీయే వెల్లడించింది. సాధారణంగా ఫలితాల విడుదలకు 45 రోజుల సమయం పడుతుంది. కానీ అకడమిక్ ఇయర్ ఆలస్యం కాకూడదని భావించిన ఎన్టీఏ అంతకంటే ముందే ఫలితాలను ప్రకటించేందుకు ప్రయత్నిస్తోంది. NTA జూన్ 25న తాత్కాలిక జవాబు కీని విడుదల చేసింది. ప్రతి ప్రశ్నకు రూ. 200 రుసుము చెల్లించి అభ్యంతరాలు తెలియజేయడానికి అభ్యర్థులకు జూన్ 28 వరకు సమయం ఇచ్చింది. జవాబు సరైనదైతే ఈ రుసుమును తిరిగి చెల్లిస్తారు. దాదాపు 10,000 అభ్యంతరాలు అందినట్లు, ప్రామాణిక ధృవీకరణ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కటీ సమీక్షిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఇంకా ఒరిజినల్ ఓఎమ్ఆర్ రెస్పాన్స్ షీట్లను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దీనితోపాటు ప్రశ్నాపత్రంలో రెండు తప్పిదాలు కూడా చోటు చేసుకున్నాయి. తుది ఆన్సర్ కీ విడుదలైన తర్వాత వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.