పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కొత్త మలుపు.. చార్జ్షీట్లో హఫీజ్ సయీద్ పేరు చేర్చిన NIA

జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై దర్యాప్తు సాగుతున్న సమయంలో ఇప్పుడు ఎన్ఐఏ మరో కీలక ముందడుగు వేసింది. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని పేర్కొంటూ.. అతడిని సప్లిమెంటరీ చార్జ్షీట్లో అధికారికంగా నిందితుడిగా చేర్చింది.
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్షీట్లో హఫీజ్ సయీద్ను వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా, లష్కరే తోయిబా అధినేతగా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడిగా కూడా నిందితుడిని పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతనిపై అభియోగాలు నమోదు చేసింది. భారత్పై యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం, పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించడం వంటి ఆరోపణలను ఎన్ఐఏ చార్జ్షీట్లో నమోదు చేసింది.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బైసరన్ మైదానంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా, భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక చర్య చేపట్టింది.
దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు సంప్రదాయ చొరబాటు మార్గాలకే పరిమితం కాకుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డబ్బు, పేలుడు పదార్థాలను స్వీకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2024 ప్రారంభంలో బారాముల్లాలోని గోగల్ దారా అడవుల్లో డ్రోన్ ద్వారా 20 పిస్టళ్లు, రూ.15 లక్షల క్యాష్, చైనా తయారీ గ్రెనేడ్లు ఉగ్రవాదులకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. డ్రోన్ల వినియోగం ద్వారా భద్రతా వ్యవస్థను తప్పించుకుని ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే కొత్త వ్యూహాన్ని ఉగ్రసంస్థలు అనుసరించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో పాకిస్థాన్కు చెందిన హ్యాండ్లర్ సాజిద్ జట్తో పాటు పలువురు ఉగ్రవాదులను ఎన్ఐఏ నిందితులుగా పేర్కొంది. వారిలో కొందరు తర్వాత జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో హతమయ్యారు. మరో ఇద్దరు అరెస్టయిన నిందితులపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ కుట్రలో పాల్గొన్న మొత్తం నెట్వర్క్, ప్లానర్స్, సహాయకుల వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక దర్యాప్తుల్లో ఒకటిగా కొనసాగుతోంది.