
గణేష్ నవరాత్రులు అంటే గ్రామాల్లో ప్రజలంతా కలిసికట్టుగా, ఐకమత్యంతో జరుపుకునే సామూహిక వేడుక. అయితే రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా గణేశుడి ప్రతిష్ట జరగకుండానే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూజలు, నవరాత్రులు లేకుండానే గణేశుడు గంగమ్మ ఒడికి చేరడం భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిచివేసింది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని కొందరు గ్రామస్తులు భావించారు. అయితే మరో వర్గం ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.తాము ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాన్నే ఆలయంలో ప్రతిష్టించాలని మరో వర్గం పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో చౌదరిగూడ పోలీసులు రంగంలోకి దిగారు.
ఆలయంలో గణేశుడి ప్రతిష్టకు పోలీసుల అభ్యంతరం
వివాదం మరింత ముదరకుండా పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆలయంలో ఎవరూ గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని, విగ్రహాన్ని వేరే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అయితే పోలీసుల సూచనపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు చేసేదేమీ లేక తాము తీసుకొచ్చిన గణేశుడి విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
నవరాత్రులు లేకుండానే నిమజ్జనం
సాధారణంగా గణేశుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేస్తారు. కానీ పీర్జాపూర్లో మాత్రం గణేశుడి ప్రతిష్ట, పూజలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకుండానే విగ్రహం నిమజ్జనం చేయడం చర్చనీయాంశంగా మారింది.గ్రామంలో అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన గణేష్ నవరాత్రులు ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో ఇలా ముగియడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెద్దలు, ప్రజలు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
►ALSO READ | ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూ లైన్లు