
Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాంబే హైకోర్టు ఆదేశాల నేపత్యంలో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో శివసేన(యూబీటీ), మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేర్లు ఉన్నాయి. నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, నటుడు దినో మోరియా, సూరజ్ పంచోలీ తదితరుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య, సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం, తప్పుడు సమాచారం అందించడం వంటి ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన వారికి ఈ మృతితో సంబంధం ఉన్నట్లు కాదు, ఆయా వ్యక్తుల పాత్రలపై విచారణ తర్వాత చర్యలు ఉంటాయి.
ఎవరెవరి పేర్లు ఉన్నాయి.?
సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, దినో మోరియా, సూరజ్ పంచోలీ తో పాటు ఆదిత్య ఠాక్రే భద్రతా సిబ్బంది, మాజీ ముంబై పోలీస్ అధికారులు సచిన్ వాజే, మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్, DCP విశాల్ ఠాకూర్, అప్పటి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ తదితరుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. దిశా మృతదేహానికి ఆలస్యంగా పోస్ట్మార్టం నిర్వహించిన కారణంగా వైద్యులు, సిబ్బంది, కలీనా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ, మాల్వాని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా ఎఫ్ఐఆర్లోకి ఎక్కారు.
అప్పటి ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర అధికారిక రికార్డులను ధ్వంసం చేయడం లేదా దాచిపెట్టడం, అధికారిక రికార్డులను మార్చడం, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై కూడా దర్యాప్తు చేయాల్సి ఉందని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
దిశా సాలియన్ కేసు ఏంటి.?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మృతి తర్వాత కొద్ది రోజులకే దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం పై నుంచి పడిపోయి మరణించింది. అప్పట్లో ఈ కేసులో తీవ్ర రాజకీయ, ప్రజా చర్చకు దారి తీసింది. అయితే ఆమె మరణాన్ని పోలీసులు ‘‘యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట(ఏడీఆర్)గా నమోదు చేశారు. దిశా కుటుంబం మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపించింది.
హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్..
దిశా సాలియన్ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. గత విచారణ సందర్భంగా జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిన్ మంజుషా దేశ్పాండేలు ఈ కేసుపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తారు. హత్య జరిగిందని దిశా కుటుంబం చెబుతున్నప్పటికీ, పోలీసులు ఏడీఆర్ కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. దిశా మరణించి 5 ఏళ్లు గడిచినా కుటుంంబానికి పోస్టుమార్టం నివేదిక, ఏడీఆర్ కాపీలు అందలేదని కోర్టు పేర్కొంది. ఈ పరిణామాల కారణంగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తుతో నిజం చివరకు బయటకు వస్తుందనే నమ్మకం ఉందని దిశా తండ్రి సతీష్ సాలియన్ అన్నారు.