Reading Time: < 1 minute
Cm Vijay London Tour Trisha Opposition Criticism Public Money

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ త్రిషతో కలిసి లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెట్టుబడుల కోసం లండన్‌కు వెళ్తున్నట్లు చెప్పి.. ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. త్రిషతో కలిసి పెట్టుబడులకు వెళ్లడమేంటి? అని నిలదీస్తున్నాయి.

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి విజయ్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. విజయ్‌ను ఎద్దేవా చేస్తూ.. తాను తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ పర్యటన ఫొటోలను చూశానని.. అందులో ఒక్క పారిశ్రామికవేత్త కూడా లేరని పళనిస్వామి ధ్వజమెత్తారు. పెట్టుబడుల కోసం లండన్ వెళ్లారని చెబుతున్నారని.. అసలు అలాంటి సమాచారం లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ ధ్వజం..

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ పర్యటనను ప్రశ్నించారు. విజయ్‌తో పాటు లండన్‌లో పర్యటిస్తున్న వారి గురించి స్పష్టత కోరారు. మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో విజయ్‌తో పాటు నటి త్రిష ఎందుకు కనిపించిందని ప్రశ్నించారు.

‘‘పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో సీఎం విజయ్ లండన్ పర్యటనను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికారికంగా ప్రకటించారు. ఐదు రోజులు గడిచినా పెట్టుబడులకు సంబంధించిన ఒక్క సమావేశం గానీ.. కార్యక్రమం గానీ వాస్తవంగా జరిగినట్లు అధికారిక సమాచారం ఏదీ లేదు. నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న ఒక కార్ రేసులో ముఖ్యమంత్రి కనిపించిన కార్యక్రమాన్ని మాత్రమే మేము చూశాము. టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో ప్రసారమైన ఫుటేజీలో మంత్రి అధవ్ అర్జున, నటి త్రిష కనిపించారు. పెట్టుబడిదారులు మాత్రం కనిపించలేదు.’’ అని బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి అన్నారు.