Reading Time: < 1 minute
Lok Sabha Paper Leak Bill Discussion Om Birla Consensus Opposition

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నివారణ) సవరణ బిల్లు-2026పై నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన చొరవ ఫలించడంతో మంగళవారం నుంచి బిల్లుపై చర్చ ప్రారంభించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం. సోమవారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నివారణ) సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

బిల్లు ప్రవేశపెట్టే ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పోటీ పరీక్షల పారదర్శకత, కోట్లాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో నినాదాలకు బదులుగా విస్తృతంగా చర్చ జరపాలని కోరారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం బిల్లును ప్రవేశపెట్టే ముందు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ పేర్లను స్పీకర్ ప్రకటించారు. అయితే ఎవరూ మాట్లాడకపోవడంతో జితేంద్ర సింగ్‌కు బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించారు.

బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ‘‘నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ బిల్లు ప్రజా పరీక్షల వ్యవస్థను మెరుగుపరిచే తొలి అడుగు. నినాదాలు చేయడం కంటే సభలో చర్చించండి. మీరు సూచించే మార్పులను ప్రభుత్వం పరిశీలించి సాధ్యమైనంత వరకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంది.’’ అని అన్నారు. బిల్లుపై చర్చ కోసం ఆరు గంటల సమయం కేటాయించినట్లు స్పీకర్ తెలిపారు. అవసరమైతే సభ అభిప్రాయం మేరకు మరింత సమయం కూడా ఇవ్వొచ్చని చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పరిష్కరించుకునేందుకు మూడు గంటల సమయం కూడా ఇచ్చారు.

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీనిర్వహించిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.