Reading Time: 2 minutes
Jasprit Bumrahs Afghanistan Test Participation Depends On Bcci Medical Clearance

Jasprit Bumrah To Play IND vs AFG Test: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్థాన్‌తో సొంత గడ్డపై భారత్ ఓ టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026లో నిరాశపర్చిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ మెడికల్ టీమ్ అనుమతి ఇస్తేనే బుమ్రా ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.

ప్రస్తుతం హాజరుగుతున్న ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతడి ఎకానమీ రేట్ 8.53గా ఉంది. గత పదేళ్లలో ఐపీఎల్‌లో ఇది అత్యధిక ఎకానమీ రేట్‌గా నమోదైంది. దీంతో బుమ్రా ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘బుమ్రాపై వర్క్‌లోడ్ పెద్దగా లేదని బీసీసీఐ మెడికల్ టీమ్ భావిస్తేనే అతడు ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతాడు. వన్డే సిరీస్‌లో మాత్రం ఆడించే అవకాశమే లేదు. స్వల్ప సమస్య ఉన్నా కూడా మొత్తం సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే బుమ్రాకు వన్డేల్లో రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అందుకే అతడిని శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ లిస్ట్-ఏ సిరీస్‌కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. గత విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన ప్రిన్స్.. ఐపీఎల్ 2026లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీని అద్భుతమైన సీమింగ్ డెలివరీతో ఔట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హర్షిత్ రాణా ఇంకా ఫిట్ కాకపోవడంతో ప్రిన్స్‌కు ఇదే సరైన అవకాశం అని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

టీమిండియాకు ఏకైక టెస్టులో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో కేఎల్ రాహుల్ తొలి వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. ఇషాన్ కిషన్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రిషభ్ పంత్ ఫామ్ నిరాశపరుస్తుండగా.. టీ20 వరల్డ్ కప్ 2026లో రాణించిన ఇషాన్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉండటం అతడికి కలిసివచ్చే అంశంగా మారింది. మంగళవారం (మే 19) బీసీసీఐ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో సెలెక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.