
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు.
సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎంతో కలిసి సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. సాయికృష్ణ ఘటనపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుండబద్ధలు కొట్టారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.
►ALSO READ | నాలుగేళ్లుగా విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్
ఏపీలో విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. సాయికృష్ణ డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని.. బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.