Reading Time: 2 minutes
Ap Government Orders High Level Probe Into Saikrishna Incident At Krishnalanka Police Station

Sai Krishna Incident: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణను పోలీస్ లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసుపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని సూచించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటనతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటనపై చర్చ సందర్భంగా డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపిన విషయాన్ని డీజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.

అనంతరం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్తంగా.. గాదె సాయి కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 9 బృందాలను ఈ కేసు కోసం ఏర్పాటు చేస్తున్నారు. గాదే సాయి కృష్ణ ను పోలీసులు తీసుకెళ్లి హింసించి లాకప్ డెత్ పోలీసులు చేశారని 38 రోజులుగా సాయికృష్ణ ఆచూకీ తెలియటం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా పోలీసులను కలిసి వినతిపత్రం ఇవ్వటంతో పాటు ఆందోళన కూడా నిర్వహించారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజా ఆదేశాలు ఇవ్వటంతో సాయి కృష్ణ వ్యవహారం కీలక మలుపు తీసుకున్నట్లుగా అయింది.. ఇవాళ ఉదయం కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ నాగేశ్వరరావు ఇతరులు ప్రెస్ మీట్ పెట్టి తమకు ఏ పార్టీతో సంబంధం లేదని ఎన్నికల్లో మాత్రం లోకేష్, పవన్ కోసం పనిచేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ గతంలో తమకు న్యాయం చేయాలని బాధ్యత చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు..