
కాయకష్టం చేసి సంపాదించిన డబ్బంతా సైబర్ నేరగాళ్లు చిటికలో మాయం చేసేస్తున్నారు. వృద్ధాప్యంలో బతికేందుకు దాచుకున్న డబ్బంతా కంత్రీగాళ్లు కొట్టేసి ముసలోళ్ల కడుపు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సైబర్ నేరగాళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
బుధవారం సైబర్ నేరగాడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవుల వంటివారు.’’ అని వ్యాఖ్యానించారు. సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ.. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని మోసం చేసి సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ‘పరాన్నజీవుల’ వంటి వారని వ్యాఖ్యానించింది. అటువంటి నేరగాళ్ల పట్ల ఉదారంగా వ్యవహరించకూడదని.. వారిని జైలులో ఉంచడమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉత్తమమని సీజేఐ స్పష్టంగా పేర్కొన్నారు. సైబర్ నేరాల నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్యానించారు.
నిందితులు ఒక రాష్ట్రంలో మోసాలకు పాల్పడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని.. దీనివల్ల ఈ నేరాలను నియంత్రించడం మరింత సవాలుగా మారుతుందని తెలిపారు. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది.
పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్టులు’, సైబర్ మోసాల కేసులను సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించింది. అంబాలాకు చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితకాలపు పొదుపును కోల్పోవడానికి కారణమైన మోసాన్ని వివరిస్తూ ఒక లేఖ రాసిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. గతంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాల కేసులలో చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు అటువంటి కేసులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.