
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నేవీ ‘‘హార్ముజ్ జలసంధి’’ దిగ్బంధంపై పొగడ్తలు కురిపించారు. తమను తాము ‘‘పైరేట్స్(సముద్రపు దొంగలం)’’ అని ప్రకటించుకున్నారు. హార్ముజ్ ప్రాంతంలో యూఎస్ నేవీ ఆపరేషన్ల గురించి ట్రంప్ ఫ్లోరిడాలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము నౌకలపై దిగిపోతాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం. కార్గో, చమురును తీసుకుంటాం. ఇది లాభదాయకమైన వ్యాపారం. మేము సముద్రపు దొంగలుగా ఉన్నాం, కానీ ఆటలు ఆడటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
అయితే, దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమే అని మండిపడింది. సముద్రంపై ఆయుధాలతో దోపిడిగా అభివర్ణించింది. పైరసీకి ఇది చట్టబద్ధత కల్పించడమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి విమర్శించారు. అమెరికా బలగాలు ఇటీవల రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాయి. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మళ్లీ సముద్రపు దొంగల యుగాన్ని చూస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ యుద్ధంలో హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ మార్గంలోని అమెరికా, ఇరాన్లు పోటాపోటీగా నౌకల్ని అడ్డుకుంటున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. ఈ దిగ్బంధం అవసరమైనంత కాలం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, అమెరికా తమ పోర్టులపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.