Reading Time: 2 minutes
Nayara Energy Fuel Price Hike India Petrol Diesel Middle East War Impact

Petrol, diesel prices hiked by Nayara Energy across India: మధ్యప్రాచ్యం యుద్ధం ఎఫెక్ట్ ఇంధన రంగంపై పడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సతమతమవుతున్నాయి. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఇంధన కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో శుక్రవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5.30, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది. కాగా.. నయారా ఏడాదికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీ అయిన వడినార్ ఆయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా పెట్రోల్ పంపులను కలిగి ఉంది. గతేడాది 450,000 టన్నుల పాలీప్రొపీలిన్ ప్లాంట్‌తో పెట్రోకెమికల్స్ రంగంలోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీని గతంలో ఎస్సార్ ఆయిల్ అని పిలిచేవారు. 2017లో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, ట్రాఫిగురా, యూసీపీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌ల కన్సార్టియం కలిసి ఎస్సార్ ఆయిల్‌ను 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత ఆ సంస్థకు నయారా ఎనర్జీ అని పేరు మార్చారు.

READ MORE: CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

మరోవైపు.. ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి నుంచి వచ్చే ముడి చమురు నెల రోజులుగా అందడం లేదు. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు రవాణాకు అంతరాయం కలగడంతో దేశానికి ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఎందుకంటే.. రష్యా వంటి దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం నిరంతరం చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలతో చమురు కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌కు 90 డాలర్లకు లభించిన ముడి చమురు, ఇప్పుడు బ్యారెల్‌కు 160 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే గత వారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలను రూ. 2 వరకు పెంచాయి. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కానీ.. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ పెట్రోల్, డీజిల్ విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ రేట్లు పెంచడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.