Reading Time: < 1 minute
Deeply Concerned Modi On Reported Attack On Putin Residence

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. రష్యా రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందాన్ని అడ్డుకునేందుకు రష్యా అబద్ధాలు చెబుతోందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

మోడీ ఖండన..
పుతిన్ నివాసంపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. డ్రోన్ దాడుల వార్తలు తెలియగానే ‘తీవ్ర ఆందోళన’ చెందినట్లుగా తెలిపారు. ప్రపంచ నాయకులు సంయమనం పాటించాలని.. శాంతి కోసం దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కోరారు.

ట్రంప్..
ఇదే విషయంపై ట్రంప్ కూడా స్పందించారు. పుతిన్ నివాసంపై దాడి వార్తలు తెలియగానే పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఇలా జరగడం మంచిది కాదన్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇలా జరగడం భావ్యం కాదన్నారు. పుతిన్ నుంచి విషయం తెలుసుకోగానే.. చాలా కోపంగా ఉన్నట్లు చెప్పారు.

షెహబాజ్ షరీఫ్
ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అన్ని రకాల హింసలను పాకిస్థాన్ తిరస్కరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి హేయమైన చర్య శాంతి, భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని చెప్పారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు పాకిస్థాన్ సంఘీభావాన్ని తెలిపింది.