Reading Time: < 1 minute
ఇరాన్ – అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌! ఎల్‌పిజిపై కేంద్రం కీలక నిర్ణయం!

అమెరికా – ఇరాన్ మధ్య సుమారు 39 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ ముగిసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎల్‌పిజి సరఫరా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సమయంలో హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతినగా, భారత్‌లో కూడా ఎల్‌పిజి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్రం పారిశ్రామిక రంగానికి ఎల్‌పిజి సరఫరా కోసం కొత్త ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గృహేతర (నాన్-డొమెస్టిక్) ఎల్‌పిజిలో రాష్ట్రాలకు కేటాయించిన 70 శాతం కోటాకు అదనంగా మరో 10 శాతం కేటాయింపు ఇవ్వనుంది. అయితే ఈ అదనపు కోటా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే రాష్ట్రాలకే లభిస్తుంది.

ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్, పాలిమర్స్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్స్, గ్లాస్, సిరామిక్స్ వంటి అనేక రంగాలకు బల్క్ ఎల్‌పిజి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమలు 2026 మార్చి నాటికి తమ అవసరాల్లో కనీసం 70 శాతం ఎల్‌పిజి పొందేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 0.2 TMT పరిమితితో ఎల్‌పిజి సరఫరా ఉంటుంది. సహజ వాయువుకు మారడం సాధ్యం కాని పరిశ్రమలకు మొదట ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇందుకోసం ఆయా యూనిట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే, సాధ్యమైన చోట PNG కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడం తప్పనిసరి.

కేంద్రం, నేచ్యురల్‌ గ్యాస్ అండ్‌ పెట్రోలియం ప్రొడక్ట్స్ సప్లై ఆర్డర్ అమలు పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అదనపు 10 శాతం కోటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) విధానాలను త్వరగా అమలు చేయాలని సూచించింది. యుద్ధానంతర ఇంధన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, పరిశ్రమలకు తక్షణ ఉపశమనం కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో గ్యాస్ వినియోగాన్ని సమతుల్యం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి