
ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్ కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శ్యాం రిచర్డ్ ఎంబీఏ చదివాడు. గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆన్ లైన్ లో పలు వ్యాపారాలు చేసినా.. కలిసి రాలేదు. దీంతో జల్సాలకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు.
ఫిబ్రవరి 22న ఓ దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరై తిరిగి హైదరాబాద్ కు వెళ్తూ.. మార్గమధ్యలో చౌటుప్పల్లో తాళం వేసిన ఇంట్లో రూ.14.20 లక్షలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గజదొంగ బాగోతం బయటపడింది.
Choutuppal Police
నిందితుడు నుండి రూ.7 లక్షల నగదు, కారు, రెండు ఫోన్లు, లాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్ లో ఉన్న రూ.2.28లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు ఈ గజదొంగ లోని మరో కోణాన్ని కూడా పోలీసులు చెప్పారు. చోరీ చేసిన సొత్తుతో నిందితుడు జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్స్ ఏర్పాటు చేసుకొని తిరిగేవాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు పేద విద్యార్థులు, అనాధ పిల్లలను చేరదీసి చదివించేవాడని చెబుతున్నారు. అయితే ఈ దొంగ మానవత్వం ఉన్న దొంగగా పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..