విద్య, వైద్యానికి రికార్డ్ నిధులు.. టిమ్స్ హాస్పిటల్స్ పనులు స్పీడప్: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల నియామకాలను పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఆయన.. విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు.
గడిచిన 15 ఏళ్లుగా రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ల నియామకాలే జరగలేదని, ఆ లోటును భర్తీ చేస్తూ తమ ప్రభుత్వమే ఈ నియామకాలను చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను సవరించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనన్నారు. అత్యంత ఉన్నతమైన నర్సింగ్ వృత్తిలో సేవలందించేందుకు వస్తున్న వారికి అభినందనలు తెలిపిన ఆయన, భవిష్యత్తులో ఆసుపత్రుల్లో నర్సింగ్ స్టాఫ్ను మరింత పెంచుతామని, మరిన్ని కొత్త నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మక టిమ్స్ (TIMS) ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నామని, అలాగే పెండింగ్లో ఉన్న ఇతర ఆసుపత్రుల పనుల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు, 28 పారామెడికల్ కాలేజీలను కూడా నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు.
నేటి పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు నిలబడాలంటే అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం. అందుకే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సెంటర్లలో నైపుణ్యాలు నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున స్టైఫండ్ కూడా అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.