July 14, 2026

Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్‌ కల్యాణ్‌.. ఫిజియోథెరపీ తప్పనిసరి

Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్‌ కల్యాణ్‌.. ఫిజియోథెరపీ తప్పనిసరి
Reading Time: < 1 minute
Pawan Kalyan Discharged From Mumbai Hospital To Reach Hyderabad Tomorrow

Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రేపు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 11న ఆయన కుడి భుజంలోని షోల్డర్ రొటేటర్ కఫ్ సమస్యకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్‌షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.

శస్త్రచికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఆయన రేపు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పూర్తి కోలుకునేందుకు సుమారు 60 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ప్రతిరోజూ కుడి చేతికి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఇక, కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత రెండు నెలల అనంతరం ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దిన్‌షా పార్థీవాలా దేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ సర్జన్లలో ఒకరు. గతంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖ క్రీడాకారులకు కూడా ఆయన విజయవంతంగా చికిత్స అందించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా వైద్య సేవలు అందించిన అనుభవం ఆయనకు ఉంది. కాగా, పవన్‌ కల్యాణ్‌కు శస్త్రచికిత్స తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.. పలువురు ఏపీ మంత్రులు, జనసేన నేతలు.. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన్ని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు..