July 14, 2026

AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..

AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
Reading Time: 2 minutes
Nellore Srihari Murder Case Main Accused Harikrishna Dies By Suicide With Family At Singarayakonda

AO M*urder Case: నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) శ్రీహరి హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన హరికృష్ణ, తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, సింగరాయకొండ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద వెళ్తున్న గూడ్స్ రైలు కింద హరికృష్ణ, అతని భార్య, ఇద్దరు పిల్లలు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో హరికృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన బావ అయిన శ్రీహరిని హత్య చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం హరికృష్ణ పరారీలో ఉండగా, గత నాలుగు రోజులుగా జిల్లా పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం హరికృష్ణ ఒక వీడియో విడుదల చేసి తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని పేర్కొన్నాడు. ఆ వీడియో వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం కేసులో మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనతో శ్రీహరి హత్య కేసు దర్యాప్తులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

కాగా, బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి (ఏవో)గా ఉన్న శ్రీహరి హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.. గత నెల 15వ తేదీన జరిగిన ఈ ఘోర హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించి ఆధారాలు కాజేసే ప్రయత్నం చేయగా, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. ఆస్తి వివాదాల నేపథ్యంలో శ్రీహరిని ఆయన సొంత బావమరిది హరికృష్ణ పక్కా ప్రణాళికతో హతమార్చినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఈ కేసులో హత్యకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ పరారీలో ఉంటూ వచ్చారు.. పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏవోగా ఉన్న శ్రీహరి తన బావమరిది హరికృష్ణను బాగా నమ్మారు.. అంతేకాదు.. కోట్ల విలువైన ఆస్తితో.. అప్పుగా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చాడు.. కానీ, ఇటీవల శ్రీహరి తనకు ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరాడట.. అయితే, ఆస్తి తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ.. బావను వదిలించుకోవాలని ప్లాన్‌ చేశాడని.. జూన్ 15వ తేదీన దైవదర్శనం పేరుతో బావను నమ్మించి పెంచలకోనకు కారులో తీసుకెళ్లి.. తిరిగి వచ్చే సమయంలో చేజర్ల సమీపంలో కారును ఆపడం.. ప్లాన్‌లో భాగంగా అప్పటికే అక్కడ మాటువేసిన రవీంద్ర, యానాది కారులో ఉన్న శ్రీహరిని గట్టిగా పట్టుకోవడం.. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే రెండు ఇంజెక్షన్లను శ్రీహరికి గుచ్చడం.. వాటి ప్రభావంతో శ్రీహరి కారులోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఇప్పుడు ప్రధాని నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో కొత్త ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది..