దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో..తెలంగాణపై తీవ్ర ప్రభావం.. వచ్చే ఏడాది కూడా ఎఫెక్ట్

- 1870ల్లో వచ్చిన దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్
- సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు
- 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక
- రాష్ట్రంపై తీవ్ర ప్రభావం..
- 45 రోజులైతున్నా పెద్ద వానల్లేవ్
- 33% వర్షపాత లోటు.. అత్యధికంగా హనుమకొండలో 66%
- మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ 50 శాతానికిపైగానే
- వర్షాల్లేక మాడిపోతున్న మొలకలు
- ప్రాజెక్టులకూ రాని వరద..
- పడిపోతున్న భూగర్భజలాలు..
- 40 డిగ్రీలకు చేరువవుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: ‘గాడ్జిల్లా’ కమ్ముకొస్తున్నది. వర్షాలను మింగేసి సాగు, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నది.ఈ సూపర్ఎల్నినో సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఆ సూపర్ ఎల్నినోకి ‘గాడ్జిల్లా’ అని బ్రిటన్ వాతావరణ సంస్థ పేరు పెట్టింది. మామూలుగా తుఫాన్లకు పేర్లు పెట్టడం సహజం. కానీ, చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన ఎల్నినోలకు ఎలాంటి పేర్లూ పెట్టలేదు. ఇప్పుడు కమ్ముకొస్తున్న ఆ సూపర్ ఎల్నినో గండం.. తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1870ల్లో వచ్చిన ఎల్నినోకు మించి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తుందని, ప్రపంచంలోని కోట్లాది మందిని ఆహార సంక్షోభంలోకి నెట్టేస్తుందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడొస్తున్న సూపర్ ఎల్నినోను అత్యంత క్రూరమైన ‘గాడ్జిల్లా’ అని పిలవాలని బ్రిటన్ వాతావరణ సంస్థ సూచించింది. ఆ గాడ్జిల్లా ఎఫెక్ట్ మన రాష్ట్రం సహా ప్రపంచమంతా కనిపిస్తున్నది. రాష్ట్రంలో వర్షాల్లేక ఇప్పటికే లక్షల ఎకరాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. నేలల్లో తడి లేక విత్తులు మొలకెత్తట్లేదు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాల జాడ కనిపించట్లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి.. రాష్ట్రంలో 33% లోటు వర్షపాతం నమోదైంది.
వచ్చే ఏడాది కూడా ఎఫెక్ట్..
ఈ ఏడాది సూపర్ ఎల్నినో తప్పదని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) తేల్చి చెప్పింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి సూపర్ ఎల్నినోగా మారేందుకు 83 శాతం అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ గాడ్జిల్లా 2027లోనూ కమ్మేస్తుందని తేల్చి చెప్పింది. అందుకు 97 శాతం అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇటు ప్రపంచ వాతావరణ సంస్థ నైరుతి పసిఫిక్ మహా సముద్రంలో జలాలు తీవ్రంగా వేడెక్కాయని వెల్లడించింది. అంతేగాకుండా.. ఎసిడిక్గా మారుతున్నాయని తెలిపింది.
సముద్రాలు కార్బన్ డై ఆక్సైడ్ను ఎక్కువగా శోషించుకుంటుండడంతో పసిఫిక్ ఆమ్లీకరణ పెరుగుతున్నదని, దానికితోడు పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఆక్సిజన్ పోతుండడంలాంటివి ఆందోళన కలిగిస్తున్నదని వెల్లడించింది. అంతేకాదు.. ఆసియా, పసిఫిక్ రీజియన్లలో ఉన్న ఉష్ణమండల గ్లేసియర్లు 2026 ఆఖరు లేదా 2027 ప్రారంభం నాటికి కనుమరుగైపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలు ఎక్కువ నమోదవుతాయని డబ్ల్యూఎంవో సహా వివిధ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు వెల్లడించాయి. అంటే 2015 ఎల్నినో సమయంలో ఉష్ణోగ్రతలు 2.75 డిగ్రీలు ఎక్కువుంటే.. ఇప్పుడు దానికన్నా 0.85 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 1877లో వచ్చిన ఎల్నినోకు మించి ఇప్పుడు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో వానల్లేవ్..
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులైపోయింది. ఈపాటికి రాష్ట్రంలో సాధారణం లేదా అధిక వర్షపాతం నమోదవ్వాలి. పడే వర్షాలతో రైతులు నాటిన విత్తనాలు మొలకెత్తి పెరిగే దశకు చేరుకుంటుంటాయి. ఎగువన వర్షాలు, వరదలతో ప్రాజెక్టులకు జలకళ వచ్చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి చూద్దామన్నా కనిపించడం లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం మైనస్లోనే ఉన్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈపాటికి 236.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 158.7 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే ఇప్పటివరకు 33 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. 33కు 33 జిల్లాల్లోనూ వర్షపాతం సగటు మైనస్లో ఉన్నది. ఒక్క నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కాస్తోకూస్తో నయమనిపించేలా ఉన్నది. మిగతా అన్ని జిల్లాల్లోనూ మైనస్ 15 నుంచి మైనస్ 66 వరకు వర్షపాత లోటు ఉన్నది.
ఆ ఆరు జిల్లాలు దారుణం
ముఖ్యంగా ఆరు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హనుమకొండ, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లో 50 శాతానికిపైగా వర్షపాత లోటు ఉన్నది. హనుమకొండ జిల్లాలో అయితే ఇంకా దారుణ పరిస్థితులున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ లోటు వర్షపాతం ఉన్న జిల్లా అదే కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఆ జిల్లాలో 256.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. పడింది కేవలం 86.6 మిల్లీ మీటర్లే. ఆ జిల్లాలో అత్యధికంగా 66 శాతం లోటు ఉన్నది. లార్జ్ డెఫిషియెంట్ కేటగిరీలో ఉన్నది. ఇటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 59 శాతం, వరంగల్లో 57 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 51 శాతం, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లోనూ 50 శాతం లోటు ఉన్నది.
మేడ్చల్జిల్లాలో 188 మిల్లీ మీటర్లకుగానూ 77.8 మిల్లీ మీటర్లు, వరంగల్లో 274 మిల్లీ మీటర్లకుగానూ 118 మిల్లీ మీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 133 మిల్లీ మీటర్లకుగానూ 65 మిల్లీమీటర్ల మేర సగటు వర్షపాతం నమోదైంది. ఇటు యాదాద్రి భువనగిరిలో 45 శాతం, వికారాబాద్లో 43, కరీంనగర్, జగిత్యాల, నారాయణపేటల్లో 42 శాతం, మంచిర్యాల, హైదరాబాద్లలో 41 శాతం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40 శాతం లోటు నమోదవడం కలవరపరుస్తున్నది.
వర్షాల్లేవ్.. ఇంకో వారం దాకా ఉండవ్
జులైలో రెండు వారాల్లో చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. వారం పది రోజుల నుంచి కేవలం పొడి వాతావరణమే ఉన్నది. గాలులు మాత్రం తీవ్రంగా వీస్తున్నాయి. రేపో ఎల్లుండో వర్షం పడుతుందిలే అనుకున్నా.. మరో వారం వరకూ వర్షాలుపడే పరిస్థితి లేదని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. వర్షాలు పడేందుకు అనువైన వెదర్ సిస్టమ్స్ ఏవీ అభివృద్ధి కావడం లేదని, దీంతో వర్షాలు పడేందుకు ఆస్కారం లేకుండా పోతున్నదని తెలిపింది. అదే సమయంలో గాలులు తీవ్రంగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 39 డిగ్రీల రేంజ్లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి.
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, నారాయణపేట, సూర్యాపేట, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ 39 డిగ్రీల రేంజ్లో టెంపరేచర్లు నమోదయ్యాయి. సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఎక్కువగా రికార్డవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ 40 డిగ్రీల మార్క్ను టచ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు క్యూర్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
38 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. అత్యధికంగా ఖైరతాబాద్లో 37.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కవాడిగూడలో 37.3, శంషాబాద్లో 37.2, ఎల్బీనగర్లో 37.1, మియాపూర్లో 37.1 డిగ్రీలు, కార్వాన్ 37.1, మలక్పేటలో 37, హయత్నగర్లో 37 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా అన్ని సర్కిళ్లలోనూ 35 నుంచి 36.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు
వర్షాల్లేకపోవడంతో భూమిలోని నీళ్లు కూడా ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు పెరగాలంటే లోకల్ క్యాచ్మెంట్ కూడా ఎంతో కీలకం. కానీ, స్థానికంగా వర్షాల్లేక భూగర్భజలాలు పడిపోయాయి. ఈ ఏడాది మేలో భూగర్భ జలాలు 9.26 మీటర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు 9.47 మీటర్లకు పడిపోయాయి. మొత్తంగా 17 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. అత్యధికంగా హైదరాబాద్లో భూగర్భజలమట్టం 2.5 మీటర్లమేర పడిపోయింది.
మేలో 9.93 మీటర్ల వద్ద గ్రౌండ్ వాటర్ ఉండగా.. ఇప్పుడు 12.43 మీటర్ల దగ్గర ఉన్నాయి. పెద్దపల్లిలో 1.6 మీటర్లు, సిద్దిపేటలో 1.26, సిరిసిల్లలో 1.17 మీటర్లు, నిజామాబాద్లో 0.75, నిర్మల్లో 0.73 మీటర్లు, ఆదిలాబాద్లో 0.49 మీటర్లు, హనుమకొండలో 1.22 మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 0.95 మీటర్లు, జగిత్యాలలో 0.32 మీటర్లు, జనగామలో అర మీటరు, కరీంనగర్లో అర మీటరు, మంచిర్యాల, మేడ్చల్లో అర మీటరు చొప్పున భూగర్భజలాలు పడిపోయాయి.