July 17, 2026

Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Reading Time: 2 minutes
Tovino Thomas Period Action Drama Palli Chattambi Tovino Streaming On Sonyliv From July 24

Palli Chattambi OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే మూవీ లవర్స్‌కు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మలయాళ స్టార్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం, సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా చూసేయచ్చు.

సోనీలివ్‌లో స్ట్రీమింగ్

ఈ ఏడాది ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన ‘పల్లిచట్టంబి’కి డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. రిలీజ్ నుంచే మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 2026 జూలై 24 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు.

కథ

1950ల కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా కథ కృష్ణ పిళ్ళై అనే వ్యక్తి కేంద్రంగా సాగుతుంది. చిన్నతనంలోనే దారుణమైన దాడిలో తన కుటుంబాన్ని కోల్పోయిన కృష్ణను ఒక మత గురువు, స్థానిక కుటుంబాలు ఆదరిస్తూ పెంచుతారు. జీవితంలో వరుస విషాదాలు ఎదురైనా, అన్యాయానికి ఎదురు నిలవాలనే సంకల్పంతో అతను ఎదుగుతాడు. అనంతరం పోతన్ క్రిస్టోఫర్ అనే పేరుతో కనియార్ గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటాడు.

గ్రామంలో అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో పాఠశాల ఏర్పాటు చేయాలని కలలు కనే రెబెక్కాతో అతనికి ఏర్పడే అనుబంధం కథలో ఎమోషన్ పెంచుతుంది. అయితే గ్రామంలో వరుస హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కృష్ణ ఒక పెద్ద కుట్రను గుర్తిస్తాడు. ప్రజలను సంవత్సరాలుగా అణచివేస్తున్న శక్తివంతమైన భూస్వామి వెనుక కుట్రలను వెలికితీయడానికి అతను చేసే పోరాటమే సినిమా ప్రధానాంశం. చివరికి భూస్వామితో జరిగే తుది పోరాటం కథను క్లైమాక్స్‌కు తీసుకెళ్తూ, సీక్వెల్‌కు కూడా ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది.

తారాగణం

ఈ చిత్రంలో టోవినో థామస్‌తో పాటు కయదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, శత్రు, విజయరాఘవన్, సిద్ధిక్, బాబురాజ్, నిబ్రాజ్ నౌషాద్, టీజీ రవి, జానీ ఆంటోని, సుధీర్ కరమన, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ ఈ చిత్రాన్ని ఎమోషన్, యాక్షన్, సామాజిక సందేశం కలగలిపిన పీరియడ్ డ్రామాగా రూపొందించారు. పీరియడ్ యాక్షన్ డ్రామాలు, గ్రామీణ నేపథ్యంతో సాగే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పల్లిచట్టంబి’ తప్పకుండా చూడాల్సిన సినిమా . జూలై 24 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.