Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!

Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది, ఓ మైనర్ బాలిక ప్రియుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు చేసుకుంటున్నాను అంటూ చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి మూసాపేట్ గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు, నిర్మల సాహూ గత కొన్ని సంవత్సరాల క్రితం మూసాపేట్ జనతా నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. త్రిలోచన్ కుమార్తె సమీపంలోని స్థానికంగా ఉన్న ఎస్ఎం మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటుంది. అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తున్న నరేష్ తో సాన్నిహిత్యం ఏర్పడి, సామాజిక మాధ్యమల ద్వారా చాటింగ్ చేసుకుంటున్నట్టు విషయం తెలిసిన తల్లిదండ్రులు అమ్మాయిని మందలించారు.
మరోవైపు నరేష్ కు మరోసారి అమ్మాయితో మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుండి నరేష్ ఆ బాలికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దాంతో మానసికంగా కృంగిపోయిన బాలిక.. నరేష్ మాట్లాడడం లేదంటూ మనస్తాపం చెంది అతడికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం ఇచ్చింది. వెంటనే నరేష్ బాలిక బంధువులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని నాకు వీడియో కాల్ చేసిందని సమాచారం ఇచ్చాడు.
దానితో సమాచారం అందుకున్న బంధువులు అమ్మాయి గదిలోకి వెళ్లి చూడగా అమ్మాయి అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.