July 14, 2026

Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..

Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
Reading Time: 2 minutes
Faridabad Mystery Death Couple Found Bound In Canal Police Probe Suspected Murder

Faridabad Mystery Death: ఒక యువకుడు, యువతి కాలువలోకి దూకారనే సమాచారం మొదట ఆత్మహత్య కేసులా కనిపించింది. అయితే నీటిలో నుంచి బయటపడిన మృతదేహాల పరిస్థితి చూసిన తర్వాత పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇద్దరి చేతులు డేటా కేబుళ్లతో కట్టేసి ఉండటం, ముఖాలపై గాయాలు కనిపించడం, కారులో రక్తపు మరకలున్న సుత్తి లభించడం ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా మార్చేశాయి. ఇప్పుడు ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 11 సాయంత్రం బీపీటీపీ వంతెన సమీపంలోని ఆగ్రా కాలువలోకి ఒక యువకుడు, యువతి దూకినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం సాయంత్రం షాహ్‌పూర్ కలాన్ సమీపంలో 23 ఏళ్ల ఆకాష్ అలియాస్ అక్కు, 27 ఏళ్ల రష్మి అలియాస్ రజని మృతదేహాలను వెలికితీశారు.

మృతదేహాలను పరిశీలించిన అధికారులు కీలక అంశాలను గుర్తించారు. ఇద్దరి చేతులు డేటా కేబుళ్లతో కట్టబడి ఉండగా, ముఖాలపై గాయాలు కూడా కనిపించాయి. ఘటనాస్థలం సమీపంలో లభించిన రష్మి కారులో రెండు మొబైల్ ఫోన్లతో పాటు రక్తపు మరకలున్న సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.

ప్రస్తుతం ఆకాష్, రష్మి మునిగి చనిపోయారా? లేక ముందుగా సుత్తితో దాడి చేసి అనంతరం కాలువలో పడేశారా? అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఈ హత్యలకు కారణమైన ఘటన కూడా ఆసక్తికరంగానే ఉంది. సెక్టార్ 31కు చెందిన శివమ్ కుమార్ అనే వ్యక్తి, తన భార్య రష్మిని ఆకాష్ వేధిస్తున్నాడంటూ బీపీటీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో హెచ్చరించగా ఆకాష్ క్షమాపణ చెప్పాడని, కానీ గత పది రోజులుగా మళ్లీ వేధింపులు ప్రారంభించాడని ఆయన పేర్కొన్నారు. అయితే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రష్మి తన కారులో ఇంటి నుంచి బయలుదేరి ఆకాష్‌ను కలిసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇద్దరూ కాలువలోకి దూకినట్లు సమాచారం అందింది.

అయితే ఆకాష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపిస్తున్నారు. ఆకాష్ బావమరిది అజయ్ నగర్ మాట్లాడుతూ, పక్కా ప్రణాళిక ప్రకారం ఆకాష్‌ను అక్కడికి పిలిపించి, అనంతరం అతడిని, రష్మిని హత్య చేశారని ఆరోపించారు. దర్యాప్తు అధికారులు ప్రస్తుతం కారులో లభించిన సాక్ష్యాలు, మొబైల్ ఫోన్ల డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శివమ్ కుమార్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 109(1) కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో అసలు నిజం పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.