July 17, 2026

Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?

Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
Reading Time: 2 minutes
Off The Record About Telangana Congress Nominated Posts Delay Debate Intensifies Over Pending Appointments

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన వ్యవహారంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఈసారైనా దక్కుతాయా..? లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలే 37 కార్పొరేషన్‌ ఛైర్మన్స్‌ పదవీకాలం ముగిసిపోయింది. వాళ్లను తిరిగి కంటిన్యూ చేస్తారా..? ఒకవేళ చేస్తే… ఎంతమందికి ఛాన్స్‌ దక్కుతుందన్న అంశం కూడా కీలకంగా మారింది. దాని చుట్టూ కూడా పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… అసలు నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్‌లో పడటానికి కారకులు ఎవరన్న కోణంలో కూడా హస్తంలో డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే…. మొత్తం మీరే చేశారు… అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ వైపు చూస్తున్నారట పార్టీ లీడర్స్‌ కొందరు. ఆలస్యం మొత్తం ఆయనవల్లనే అంటూ… కొత్త డిస్కషన్‌కు తెర లేపారు. పార్టీ వైపు నుంచి సరైన ఫాలోఅప్‌ లేకపోవడం వల్లే పదవుల భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందన్నది సదరు వేలు చూపించే వాళ్ళ వాదన. కొత్త వాటి సంగతి తర్వాత, ఉన్నవాళ్ల పదవీకాలం ముగిసి రెన్యువల్‌కు వచ్చిన సమయంలో పార్టీ చీఫ్ అందుబాటులో లేరని, దాంతో సమస్య ఇంకా తీవ్రంగా కనిపిస్తోందంటూ గాంధీభవన్‌లోనే గుసగుసలాడుకుంటున్నారట.

ఐతే… PCC చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఈ చర్చను తిప్పికొడుతున్నారు. అసలా టాక్‌ రావడానికి కారణాలను కూడా వివరిస్తోంది పీసీసీ టీమ్‌. రెన్యువల్స్‌ విషయంలో మహేష్‌గౌడ్‌ కాస్త సీరియస్‌గానే ఉన్నారట. అందరికీ రెన్యువల్ చేయడం కుదరదని బాహాటంగా చెప్పడం వల్లనే ఇలాంటి ప్రచారం మొదలైందన్నది ఆయన వర్గం వాదన. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్‌ పోస్ట్‌ల భర్తీ విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అందర్నీ గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి పీసీసీ చీఫ్‌ అంత సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. పదవి వచ్చాక కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను తప్ప… మిగిలిన వారిని కొనసాగించేది లేదని క్లారిటీ ఇస్తోంది పీసీసీ. సీఎం రేవంత్ రెడ్డి కూడా పనిచేసిన వాళ్లను మాత్రమే కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట. రెన్యువల్స్‌ విషయంలో ప్రత్యేక విధానాన్ని పాటించబోతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసిన నాయకులతో ముందు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టుల్ని భర్తీ చేస్తారు.

ఆ తర్వాత రెండు నెలలకు రెన్యువల్స్‌పై చర్చించాలన్నది పీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో చాలా రోజులుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ముందస్తు ఊరట లభిస్తుందన్నది పీసీసీ ఫీలింగ్‌. ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతే భర్తీపై క్లారిటీ వస్తుంది. పార్టీకి సంబంధించిన వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా…. పదవుల భర్తీ మాత్రం ఆలస్యం అవుతోందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే అన్నిటినీ ఫిల్‌ చేసి ఉంటే… ఇప్పుడు కొత్తగా చాలా మందికి అవకాశం దక్కేది. ఈ పరిస్థితుల్లో…. సరే…. జరిగిందేదో జరిగిపోయింది…. ఇప్పటికైనా అన్ని పదవుల్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.