Reading Time: < 1 minute
Pok Protests 12 Killed Muzaffarabad March

PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ హింస చెలరేగింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌కు ముందు మంగళవారం జరిగిన ఘర్షణల్లో 12 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న పీఓకే ప్రజల్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం, ఆర్మీ దారుణంగా వ్యవహరిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైకి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ ఈ ప్రాంతంలో 4000 మంది రేంజర్స్, పోలీసులు, ఫ్రంటియర్ కార్ప్స్ బలగాలను మోహరించింది.

రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టనున్న ఈ నిరసన యాత్రను అడ్డుకునేందుకు పీఓకేలో భారీ భద్రతను మోహరించారు. రావల్‌కోట్‌లో మీడియాపై అనధికార ఆంక్షలు విధించారని, జర్నలిస్టులను అనుమతించడం లేదని బీబీసీ ఉర్దూ నివేదించింది. పీఓకేలో గత నెల రోజుల నుంచి ద్రవ్యోల్బణం, రాజకీయ ప్రాతినిధ్యం, వివక్ష వంటి అంశాలపై నిరసన కొనసాగుతోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీర్ శరణార్థులకు సీట్లను రిజర్వ్ చేయడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రిజర్వేషన్ల ద్వారా పీఓకేలో అధికారం చెలాయించాలని పాక్ ప్రభుత్వం భావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏఏసీ సంస్థను పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఇక ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వాన్ని పీఓకేకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించింది. నిత్యావరసరాలు, మందుల వంటి అత్యవసర వస్తువుల్ని బ్లాక్ చేస్తోంది. ఫలితంగా ఉద్యమాన్ని అణచాలని చూస్తోంది. ఇంటర్నెట్‌ను సస్పెండ్ చేసింది. దీంతో పీఓకేలో ఏం జరుగుతుందో మిగతా ప్రపంచానికి తెలియకుండా పాక్ జాగ్రత్త పడుతోంది.