HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr

HYD 21CR CHEATING: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే.. ఊహించనంత లాభం వస్తుంది… ఒకటికి పది రెట్లు.. ఇంకా అంత కంటే ఎక్కువగానే సంపాదించవచ్చు.. మేం సూచించే క్రిప్టోలో పెట్టుబడి పెడితే చాలు.. అంటూ సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఒ వృద్ధున్ని మాయచేసి ఏకంగా 21 కోట్ల రూపాయలు కొట్టేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిందీ ఘటన. నేను దివ్యను మాట్లాడుతున్నాను.. అంటూ అవతలి నుంచి వాట్సాప్లో అమ్మాయి పలకరించింది. కానీ ఆ వాయిస్ కాల్ వల్ల 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకంగా రూ.21.06 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. యువతిగా పరిచయం పెంచుకున్న సైబర్ కేటుగాళ్లు.. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పేరుతో నమ్మకం కల్పించి, దశలవారీగా కోట్ల రూపాయలు కాజేశారు..
క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు
గ్వాలియర్కు చెందిన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అశోక్ విజయవర్గియాకు 2025 డిసెంబర్లో వాట్సాప్ ద్వారా “దివ్య” పేరుతో ఓ మహిళ పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే స్నేహం పెంచుకుని, యూఎస్డీటీ .. USDT క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్ను చూపించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. మొదట బాధితుడు యూపీఐ ద్వారా నాలుగు విడతల్లో రూ.10 వేల చొప్పున పంపించగా, అనంతరం మరో రూ. లక్ష బదిలీ చేశాడు. 2026 జనవరి 7న అతని HDFC బ్యాంకు ఖాతాలో రూ.1.88 లక్షలు లాభంగా జమ కావడంతో ట్రేడింగ్ నిజమేనన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత డిసెంబర్ చివరి నుంచి జులై 2026 వరకు మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా రూ.21.06 కోట్లను బదిలీ చేశాడు.
రిస్క్ మార్జిన్ పేరుతో మరో రూ. కోటి చెల్లించాలని డిమాండ్
బాధితుడు పెట్టుబడి పెడుతున్న కొద్దీ నకిలీ ట్రేడింగ్ పోర్టల్లో అతని పెట్టుబడి పెరుగుతున్నట్లు తప్పుడు గ్రాఫ్లు చూపించారు. చివరకు అతని ఖాతాలో రూ.33.25 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రదర్శించారు. అయితే ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, ముందుగా రూ.10.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలని, అనంతరం రిస్క్ మార్జిన్ పేరుతో మరో రూ. కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు.
BNS సెక్షన్లు 318(4), 319(2) కింద కేసు నమోదు
ఈ మోసానికి సంబంధించిన నిధులను దేశవ్యాప్తంగా వేలాది నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా నాలుగు అంచెల వ్యవస్థలో బదిలీ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం నేరుగా డబ్బు స్వీకరించిన 77 ఫస్ట్-లేయర్ బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితుడు సకాలంలో ఫిర్యాదు చేయడంతో ఆయా ఖాతాల్లో ఉన్న రూ. 2 కోట్లను స్తంభింపజేయగలిగారు. ఈ ఘటనపై గుర్తుతెలియని నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 319(2), సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66డీ కింద కేసు నమోదు చేశారు. మోసానికి ఉపయోగించిన వెబ్సైట్లు, వాట్సాప్ నంబర్లు, ఐపీ అడ్రస్లను ట్రాక్ చేస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. మిగిలిన నిధుల రికవరీతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ క్రిప్టో మోసాల నెట్వర్క్ను ఛేదించేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.