Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాన్ని బుధవారం-గురువారం మధ్యరాత్రిలో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం.. తర్వాత తీవ్రతను 5.9కు సవరించినట్లు న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. తర్వాత పరిస్థితిని సమీక్షించి దానిని అడ్వైజరీ స్థాయికి తగ్గించారు.
ఫియోర్డ్లాండ్ సమీపంలో భూకంప కేంద్రం
అధికారుల వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్లాండ్కు ప్రధాన ప్రవేశ ద్వారమైన టే అనౌ పట్టణానికి ఉత్తరంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) కూడా ఈ భూకంప తీవ్రతను 5.9గా నిర్ధారించాయి. భూకంపం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు వెల్లడించాయి.
భూకంపం తీవ్రతను తిరిగి అంచనా వేసిన అనంతరం న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది. ‘‘ఫియోర్డ్లాండ్ సమీపంలో సంభవించిన భూకంప తీవ్రతను 5.9గా సవరించాం. అందువల్ల ముందుగా జారీ చేసిన సునామీ హెచ్చరికను తగ్గించి జాతీయ స్థాయి అడ్వైజరీగా మార్చాం.’’ అని వెల్లడించింది.
న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ప్రకారం.. భూకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లో అసాధారణ సముద్ర ప్రవాహాలు, బలమైన అలలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈత కొట్టేవారు, సర్ఫింగ్ చేసేవారు, చేపలు పట్టేవారు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు తక్షణమే నీటి నుంచి బయటకు రావాలని సూచించింది. అలాగే బీచ్లు, నౌకాశ్రయాలు, మరీనాలు, నదీ ముఖద్వారాలు వంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ప్రత్యేక సూచనలు
సముద్రంలో లేదా మరీనాల్లో బోట్లలో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, అధికారుల అనుమతి వచ్చే వరకు తిరిగి బోట్లలోకి వెళ్లవద్దని సివిల్ డిఫెన్స్ శాఖ స్పష్టం చేసింది. అయి తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం లేదని, స్థానిక అధికారులు ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ఇతర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అధికారిక హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.