July 17, 2026

Telangana: 8 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే..

Telangana: 8 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే..
Reading Time: < 1 minute
Telangana: 8 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే..

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతికార హత్య కలకం రేపింది. శెట్టి ఆత్మకూర్ శివారులో ఈ నెల 10వ తేదిన జరిగిన గుంటిపల్లి రాజు అలియాస్ డోజర్ రాజు దారుణ హత్యకు గురయ్యాడు. మొదట సాధారణ హత్యగా కనిపించిన ఈ కేసు దర్యాప్తులో ఏళ్ల తరబడి రగిలిన ప్రతీకారానికి పరాకాష్టగా తేలింది. మృతుడి సోదరుడు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హత్య వెనుక ఉన్న క్రైమ్ కహానీని ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య సైదమ్మతో రాజు అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను గ్రామం నుంచి తీసుకొని వెళ్లిపోయాడు. తర్వాత 2017లో గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో కాపురం పెట్టారు. అయితే శెట్టి ఆత్మకూరు గ్రామంలో బంధువులను కలిసేందుకు రాజు, సైదమ్మ ఇద్దరు వచ్చారు. ఈ క్రమంలో ఆంజనేయులు, రాజు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఆంజనేయులును గొడ్డలితో నరికి చంపాడు రాజు.

ఈ కేసులో నేరం రుజువు కావడంతో రాజుకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు రాజు. ఇక తల్లితో వివాహేతర సంబంధం, తండ్రి హత్యను మరచిపోలేని ఆంజనేయులు కుమారులు విజయ్ కుమార్ రాజును హతమార్చాలని భావించాడు. బంధువులు లోకేష్, గోవర్ధన్, శ్రీరాములు జత కలిసి రాజును హత్య చేసేందుకు చాలా రోజులుగా అవకాశం కోసం ఎదురుచూశారు.

ఈ నెల 10వ తేది రాత్రి శెట్టి ఆత్మకూర్ శివారులో ఒంటరిగా వెళ్తున్న రాజుపై కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మృతుడి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో నిందితులను గద్వాల పట్టణంలోని కోటలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైక్ లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్డులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. ఒక వివాహేతర సంబంధంతో మొదలైన కుటుంబ వైరం.. రెండు హత్యలకు కారణమైంది.  ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.