Reading Time: < 1 minute
Mamata Banerjee July 21 Deadline Tmc Leaders Resignations

Mamata Banerjee:  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి వరసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో మెజారిటీ నేతలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీకి వ్యతిరేకంగా ఉన్నారు. మమతతో ఉన్న కొద్ది మంది నేతలు కూడా ఇప్పుడు రెబల్ వర్గంలో చేరుతున్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ కోయెల్ మల్లిక్ తన పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే, వరస ఎదురుదెబ్బల నేపథ్యంలో మమతా బెనర్జీ టీఎంసీ నేతలకు అల్టిమేటం విధించింది. పార్టీని వదిలిపెట్టేవారు జూలై 21వ తేదీలోగా వీడాలని హెచ్చరించారు. ఆ తర్వాత టీఎంసీ కొత్త మార్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఒత్తిడి, బలవంతంతో తమ పార్టీ నేతలను పార్టీ మారేలా చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ జూలై 21న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. టీఎంసీకి సంబంధించి ఇది అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా పరిగణిస్తారు. 1993లో పోలీస్ కాల్పుల్లో మరణించిన 13 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నివాళులర్పించేందుకు టీఎంసీ ప్రతి ఏడాది జూలై 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.